రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్
కపిలేశ్వరపురం (మండపేట): మాల సామాజిక వర్గీయులంతా దేశ వ్యాప్తంగా ఐక్యం కావాల్సిన సమ యం ఆసన్నమైందని రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. మండపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో దళితులను అణచివేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఆయా పాలకులు చేసిన చట్టాలు శిలాశాసనాలు కాదని, వారి పాలనలో దళిత సామాజిక వర్గానికి లభిస్తున్న ఫలితాలేంటన్న అంశాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. రిజర్వేషన్ల పేరుతో ఇచ్చే నూటికి రెండు శాతం ఫలితాలు ఎస్సీ జాబితాలోని అన్ని కులాలకూ ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అలా పరిమితంగా అమలు చేసేదాన్ని సామాజిక న్యాయమని ఎలా పిలవగలుతున్నారని నిలదీశారు. రిజర్వేషన్లు అనగానే కేవలం ఉద్యోగాల వరకు మాత్రమే కాదని, చంద్రబాబు, రేవంత్రెడ్డి మంత్రి వర్గంలో అమలు చేయరా అని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లోని జడ్జిల నియామకాల్లోనూ, ఇతర రాజ్యాంగ వ్యవస్థల్లోనూ అమలు కావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అన్నది దళిత వర్గంపై జరుగుతున్న కుట్ర అని అన్నారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్తంగా ఐక్యం కావాలని, ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీల గొడుగుల కింద ఉన్న దళిత సామాజిక వర్గీయులు ఆలోచన చేయాలని రత్నాకర్ కోరారు.


