అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభం మీది సుదర్శన చక్రం ఇటీవల ఈదురు గాలులకు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో, ఆ చక్రాన్ని ఈ నెల 24న కిందకు దించి, ఆలయంలో భద్రపరచి, 25వ తేదీ ఉదయం సంప్రోక్షణ నిర్వహించి, తిరిగి పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని ధ్వజస్తంభంపై అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుని ఆలయంలో పాత ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరడంతో.. 2024 మే నెలలో కొత్తది ప్రతిష్ఠించారు. దీనికి బంగారు రేకును అదే ఏడాది ఆగస్టులో అమర్చారు. ఆ సమయంలోనే స్వర్ణ సుదర్శన చక్రాన్ని కూడా కలశలతో పాటు ధ్వజస్తంభంపై అమర్చారు. గత వారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఈ సుదర్శన చక్రం ఉత్తరం వైపు ఒరిగిపోయింది. ఈ విషయాన్ని అధికారులు ఈ నెల 16వ తేదీన గుర్తించి, దేవస్థానం ఆగమ పండితుల కమిటీతో చర్చించారు. వారి సూచన మేరకు ఆ చక్రానికి సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు.


