రావులపాలెం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు ఇంట విషాదం నెలకొంది. సూర్యారావుకు ఇద్దరు కుమారులు కాగా, ఇందులో రెండో కుమారుడు ప్రసాద్ (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైన ప్రసాద్ రావులపాలెంలోని తన ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చిన్న కుమారుడు గొల్లపల్లి ప్రసాద్ మృతి అత్యంత విషాదకరమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జగ్గిరెడ్డి రావులపాలెంలో గొల్లపల్లి సూర్యారావు నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రసాద్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జగ్గిరెడ్డి వెంట గ్రామ పార్టీ అధ్యక్షుడు కర్రి అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు.
నేతల సంతాపం
గొల్లపల్లి సూర్యారావును పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించి, సంతాపం తెలిపారు. ఇందులో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్రాజు, రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, మాజీ ఎంపీటీసీ జవ్వాది రవిబాబు తదితరులు ఉన్నారు.
చిన్న కుమారుడి మృతి


