అంబాజీపేట: ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గంగలకుర్రు – మొసలపల్లి రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మొసలపల్లి టర్ఫ్ (వంతెన)కు కూతవేటు దూరంలో అంబాజీపేట కొర్లపాటివారిపాలేనికి చెందిన నందెపు ప్రణీత్ నాగ (ఫణి) (14), నల్లా సుభాష్లు యాక్టీవా స్కూటర్పై గంగలకుర్రు నుంచి అంబాజీపేట వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుల్లేటికుర్రు నుంచి గంగలకుర్రు వైపు వెళుతున్న ఇసుక లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొంది. దాంతో ప్రణీత్ నాగ అక్కడికక్కడే మృతి చెందగా, సుభాష్కు తీవ్రగాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. మృతుడికు తల్లి, తండ్రి, అక్క ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ప్రణీత్ నాగ కొద్ది క్షణాలకే ఇలా కావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన పలువురిని కలచివేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న బాలుడి తండ్రి, రామకృష్ణ, చిన్నాన్న రాజులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే నీవు లేవన్న మాట జీర్ణించుకోలేకపోతున్నామని బోరున విలపించారు. మృతుడు స్థానిక స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
మరొకరికి తీవ్ర గాయాలు


