తుని: విద్యతో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, సంపాదన పట్ల అవగాహన ఉండాలని పతంజలి గ్రూప్ ఎండీ, పతంజలి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బాలకృష్ణ అన్నారు. తునికి వచ్చిన ఆయన పొరుగునే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శనివారం శంకుస్థాపన చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను పునర్వినియోగం చేసే విధానంపై తమ యాజమాన్యంతో పతంజలి సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు తెలిపారు. ఆయుర్వేద చికిత్సాలయం, ఔషధ వనం, పరిపాలన విభాగం నూతన భవనాలను ఆచార్య బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి యోగా శక్తిని, ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. త్వరలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల సహకారంతో సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టు మోడల్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. ఆయనను నరసింహారావు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో కంటిపూడి నరేంద్రబాబు, విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


