● అంతకంతకూ ఫీడ్ ధరల
పెంపు సరికావు
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ
అధ్యక్షుడు రామారావు
అల్లవరం: ఆక్వా రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం కంపెనీలతో కుమ్మకై ్క వెన్నుపోటు పొడుస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు సిండికేట్గా మారి దశల వారీగా పెంచిన రూ. 14 మొత్తాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లవరం మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ఆక్వా, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా రూ.వేల కోట్లు ప్రభుత్వానికి వస్తున్నాయన్నారు. ఆక్వా సాగు చేస్తున్న రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్ తయారు చేసే కంపెనీలు సిండికేట్గా మారి దశల వారీగా కిలోకి రూ.14 పెంచారని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతుల రక్షణ కోసం అప్సాడా చట్టాన్ని ఏర్పాటు చేసి.. ఫీడ్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా మూడు సార్లు ధరలు పెంచితే కంపెనీలతో మాట్లాడి ధరలు స్థిరంగా ఉండేలా చూశారన్నారు. ధరల స్థిరీకరణ ద్వారా రొయ్యల ధరలు పడిపోకుండా కాపాడారని తెలిపారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం, ఫీడ్ తయారీదారులకు బాసటగా నిలుస్తుందని విమర్శించారు. గత ఫిబ్రవరిలో కిలోకు రూ. 4 పెంచి, ఇప్పుడు మరో రూ. 10 పెంచి మొత్తంగా రూ. 14 అయిన తర్వాత దాని నుంచి కేవలం రూ. 4 తగ్గించి ఫీడ్ ధరలు తగ్గించామని కూటమి ప్రభుత్వం నాటాకాలు ఆడుతుందని మండిపడ్డారు. రొయ్యలు కిలోకు రూ. 50 తగ్గించి, తిరిగి రూ. 20 పెంచినట్లు చూపుతూ రైతులను మోసగిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, కంపెనీలు ఏకమై ఆక్వా రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. పెరిగిన ధరలను పూర్తి స్థాయిలో తగ్గించేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని రామారావు అన్నారు.


