ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): యువత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. స్థానిక ఐసీఏఆర్ – జాతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ (నిర్కా) ఆధ్వర్యాన ఆ సంస్థ సెమినార్ హాలులో గురువారం నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై ఏడాది పాటు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రతి రైతూ సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్, జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు ఎస్.జయరామలక్ష్మి తదితరులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేల పరీక్ష – పంట స్పందన ఆధారిత ఎరువుల సిఫారసు మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. దీని ద్వారా రైతులు తమ నేల పరీక్ష ఫలితాలు, లక్ష్య దిగుబడి ఆధారంగా వివిధ పంటలకు అవసరమైన శాసీ్త్రయ ఎరువుల మోతాదులను తక్షణమే తెలుసుకోవచ్చని, సమతుల ఎరువుల వినియోగాన్ని అమలు చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ‘నేల ఆరోగ్య నిర్వహణలో వినూత్న సాంకేతికతలు’ బులిటెన్ను కూడా ఆవిష్కరించారు.


