● పని చేసినది ఇరిగేషన్ అధికారులు
● బిల్లు పెట్టి స్వాహా చేసినది ఉపాధి విభాగం
● రూ.5.45 లక్షలకు బాధ్యులు ఎవరో మరి?
ఆలమూరు: ఉపాధి పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. అధికార పార్టీ సానుభూతి పరులకు పని చేయకుండానే మస్తర్లు వేస్తూ ఉపాధి నిధులు కాజేస్తున్నారు. మండలంలోని మోదుకూరు వెంబడి ప్రవహిస్తున్న మైనర్ ఇరిగేషన్ కాలువ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆ గ్రామానికి చెందిన పలువురు ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడంతో ఆ దోపిడీ ఆలస్యంగా వెలుగు చూసింది. మోదుకూరులోని ముత్యాల కృష్ణమూర్తి మకాం నుంచి గుమ్మిలేరులోని శ్రీశంఖేశ్వర పార్శ్వనాథ్ (బుద్ధుడు) ఆలయం వరకూ ఉన్న కాలువ పరిధిలో నీటిపారుదల శాఖ గడ్డి మందు చల్లి సంబంధిత బిల్లును ఆమోదం కోసం పంపింది. ఇదే క్రమంలో మండల ఉపాధి విభాగం ఇదే పనిని చేయకపోయినా నాలుగు వారాలు పాటు చేశామంటూ ప్రత్యేక ఐడీని రూపొందించి రూ.5,45,600 డ్రా చేయడం గమనార్హం. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా రెండో పంట పూర్తయిన తరువాత మొత్తం బిల్లులు పెడతామని వివరించారు. కాగా చేయని పనికి బిల్లు పెట్టడం, కనీస పర్యవేక్షణ లేకపోవడం, గుడ్డిగా బిల్లులు మంజూరు చేయడంపై అధికారులు ఏం చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి మరి.


