రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్చార్జి జిల్లా రెవవెన్యూ అధికారి భాస్కర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం వివిధ ఉద్యోగ సంఘాలతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుర్తింపు పొందిన వివిధ సంఘాలు ఇచ్చిన విజ్ఞప్తులు పరిశీలిస్తున్నామని జిల్లా పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరించి మిగిలిన సమస్యలను ఆయా విభాగాల రాష్ట్ర శాఖ అధిపతులకు పంపుతామన్నారు. జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షులు మీసాల మాధవరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ కార్యాలయాల్లో మహిళలకు టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా ఔట్ పేషెంట్ విభాగం ఏర్పాటు చేయాలని, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ, సరెండర్ లీవ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బోధనేతర పనులను తమకు అప్పగించవద్దని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గిరి ప్రసాద్ వర్మ, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వేణుమాధవ్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు షరీఫ్, రాజారావు, కేవీవీ సత్యనారాయణ, డేనియల్ బాబు, రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులు, బాపిరాజు, ప్రసాద్ 4వ తరగతి ఉద్యోగ సంఘ నాయకులు రమణ, వెంకటేశ్వరరావు, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యం రాజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి ఉద్యోగుల సమస్యలు వివరించారు.


