సామర్లకోట: ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. పెద్దాపురం రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఈ నెల 12 నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ పోటీల్లో అండర్– 11, 13, 15, 17, 19 విభాగాల్లో 230 మంది బాల బాలికలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్బాబు మాట్లాడుతూ మూడు రోజుల పాటు విద్యార్థులు, కోచ్లు, అంపైర్లకు వసతి, సదుపాయాలు కల్పించడంపై శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ప్రకాష్ను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డవలప్మెంట్ కమిటీ చైర్మన్ విజయ్ప్రకాష్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో ఉంటూ వారి క్రీడను మరింత పదును పెట్టుకునేందుకు ప్రయత్నించారన్నారు. చీఫ్ రిఫరీ సింగరాజు, అసిస్టెంట్ చీఫ్ రిఫరీ డాక్టర్ డీవైఎస్వై శర్మ, సీనియర్ కోచ్ వేణు, పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రశాంతి, మీడియా కోఆర్డినేటర్ ఉషా చైతన్య పాల్గొన్నారు.
మూడో రోజు విజేతలు వీరే..
టేబుల్ టెన్నిస్ అండర్– 17 బాలికల విభాగంలో శ్రీకర లాస్య (ఫన్టైమ్స్) ప్రథమ, అనన్య ఆనంద్ (ఫన్టైమ్స్) ద్వితీయ, బాలుర విభాగంలో కమిల్ భార్గవ్ (ఫన్టైమ్స్) ప్రథమ, సాయి మాన్విత్ (ఫన్టైమ్స్) ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. అండర్– 19 బాలికల విభాగంలో ఆనన్య ఆనంద్ (ఫన్టైమ్స్) ప్రథమ, హనినీ (గీతం) ద్వితీయ, బాలుర విభాగంలో వేదాంత్ (ఫన్ టైమ్స్) ప్రథమ, సాయి చరణ్ (రైజ్) ద్వితీయ బహుమతులు సాధించారు. మహిళల విభాగంలో మౌపర్ణదాసు (సినర్జీ) ప్రథమ, చార్వి ఫల్గుణ్ (ఆర్జీటీటీఏ) ద్వితీయ, పురుషుల విభాగంలో తేజ సూర్య (గీతం) ప్రథమ, మణికుమార్ (పీఎప్టీటీఏ) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు.


