కొత్తపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందజేస్తున్న సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంతో పాటు ప్రపంచ భౌగోళిక ప్రాంతాలను గుర్తించే అట్లాస్ (ప్రపంచ దేశ పటాల పుస్తకం) కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం విజ్ఞప్తి చేసింది. అట్లాస్తో విద్యార్థులకు సులువుగా ప్రపంచ జ్ఞానం లభిస్తుందని తెలిపింది.
ప్రయోజనాలు ఇవే..
పాఠ్య పుస్తకాల్లో వచ్చే నదులు, పర్వతాలు, పీఠ భూములు, మైదానాల కచ్చితమైన ఉనికిని అట్లాస్ ద్వారా గుర్తించవచ్చు. దీని వల్ల విద్యార్థికి మెరుగైన అభ్యసన జరుగుతుంది. వివిధ ప్రాంతాల వాతావరణం, వర్షపాతం, పవనాల కదలికలను థీమాటిక్ పటాల ద్వారా సులభంగా విశ్లేషించవచ్చు. అడవులు, ఖనిజాలు, నేలల రకాలు, పంటలు పండే ప్రాంతాలను అట్లాస్లో చూసి గుర్తుంచుకోవడం సులువవుతుంది. దేశాలు, వాటి రాజధానులు, రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దుల గురించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది. చదవడం కంటే పటాల రూపంలో చూడటం వల్ల సమాచారం మెదడులో ఎక్కువ కాలం గుర్తుంటుంది. స్కేల్, దిశలు, సంకేతాలను చదవడం, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు అలవడతాయి. పరీక్షల్లో మ్యాప్ పాయింటింగ్ మార్కులను సులభంగా సాధించవచ్చు. విద్యార్థులు తమకు తాముగా కొత్త ప్రాంతాల గురించి అన్వేషించే అలవాటు పెరుగుతుంది.
తప్పనిసరిగా చేర్చాలి
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాకిట్లో అట్లాస్ను ప్రభుత్వం తప్పనిసరిగా చేర్చాలి. అది విద్యార్థి అభ్యసనకు, ఉపాధ్యాయుడి ద్వారా మెరుగైన జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది.
– కేఎస్వీ కృష్ణారెడ్డి. అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, రావులపాలెం


