కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు జెడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో పూజలు నిర్వహించి, స్వామి, అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యాన భక్తుల పూజలు, దర్శనాలకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులకు మజ్జిగ చలివేంద్రాలు, బిస్కెట్ ప్యాకెట్లు, పాలు, అన్నప్రసాదం, ఉచిత ఆటో సర్వీసుల వంటి సేవలు అందించారు. ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.22,48,130, పరోక్ష పూజల ద్వారా రూ.8,63,800 అన్నప్రసాద విరాళాలుగా రూ.46,646 కలిపి మొత్తం రూ.31,58,576 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు.


