అమలాపురం టౌన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయిస్తూ చట్ట సవరణ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు సాధించేందుకు ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని సమష్టిగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా వ్యవహరించి, గ్రామాల్లో బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం, జీఓ–45 ప్రకారం ఉపాధ్యాయుల పునర్విభజన అంశంపై ఆయన అవగాహన కల్పించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీఏఎస్ సుబ్బారావు ఈ విద్యా సంవత్సర ప్రణాళికను వివరించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు పెంకే వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు తదితరులు మాట్లాడారు.


