ఫ రూ.8 లక్షల విలువైన 62 గ్రాముల
బంగారం స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన సీఐ తిలక్
నిడదవోలు: పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను సమిశ్రగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను శనివారం నిడదవోలు సీఐ కార్యాలయంలో సీఐ పీవీజీ తిలక్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఆనంద్ నగర్కు చెందిన గోడి సతీష్ కుమార్ 2025 నవంబర్ 4న నిడదవోలు మండలం సమిశ్రగూడెం కెనాల్ రోడ్డులోని కాసాని సత్యనారాయణ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుపై సమిశ్రగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేర స్థలంలో లభించిన భౌతిక, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సాయంతో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు డి. ముప్పవరం గ్రామ శివారున నిందితుడు గోడి సతీష్ కుమార్ను అరెస్టు చేసి సుమారు రూ.8 లక్షల విలువైన 62 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై వివిధ జిల్లాల్లో సుమారు 50 దొంగతనం కేసులు నమోదయ్యాయి. నిందితుడు సతీష్ కుమార్ ముందుగా పగటి పూట రెక్కి నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. రాత్రి పూట ఆ ఇంటి తలుపులకు వేసిన తాళాలను బద్ధలుకొట్టి దొంగతనాలు చేస్తాడు. పలుమార్లు ఒంటరిగా, కొన్నిసార్లు పరిచయం ఉన్న నేరస్తులతో కలిసి నేరాలు చేశాడు. కాగా.. కేసును చేధించిన సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు, సర్కిల్ క్రైమ్, స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, కొవ్వూరు డీఎస్పీ ఎ.దేవకుమార్లు అభినందించి రివార్డులు ప్రకటించారు.


