నేడు జిల్లాలో నియోజకవర్గ
స్థాయిలో నిరసన ర్యాలీలు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనపై నిరసనగా శుక్రవారం ర్యాలీలు ఆయా నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో దగాపడ్డ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇలా దగాపడిన ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున జిల్లాలోని నియోజకవర్గాలలో ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నామన్నారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా
కడియం: ప్రపంచ శాంతికి, సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో గురువారం జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ , ఆయుష్, ఏపీ ఎం ఐ పి, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరమని అన్నారు. జూన్ 21న అమరావతిలో ‘యోగాంధ్ర’ రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జేసీ మేఘాస్వరూప్ మాట్లాడుతూ జూన్ 14 సరస్వతి ఘాట్లో పర్యటక కాన్సెప్ట్ పై, ఆర్ట్స్ కళాశాలలో జూన్ 21 జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నామని చెప్పారు. కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్ రెడ్డి, ఆర్డీవో ఆర్.శివరాముడు పాల్గొన్నారు.
బస్సులో బంగారు హారం చోరీ
అనపర్తి: బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్లో ఉంచిన బంగారు హారాన్ని దొంగలు అపహరించారు. రాజమహేంద్రవరం మోరంపూడికి చెందిన టి.మంగయమ్మ ఈ నెల 4న తన కుమార్తె ఇంటికి వెళ్లడానికి రాజమహేంద్రవరం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనపర్తి చేరుకున్న తర్వాత తన బ్యాగ్లో ఉంచిన 40 గ్రాముల బంగారు హారం కనిపించకుండా పోయినట్లు గమనించారు. ఈ మేరకు గురువారం అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.


