● 14వ తేదీ వరకు అలరించనున్న
సంగీత, నృత్యోత్సవాలు
● దేశంలోని 13 రాష్ట్రాల నుంచి
కళాకారుల ప్రదర్శన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నెమలికి నేర్పిన నడకలివీ... అంటూ నాట్యకారిణిలు తమ నృత్యంతో అలరించగా... పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు వంటి అన్నమయ్య కీర్తనలతో సంగీత విద్యాంసులు తమ గానామృతంతో గురువారం గోదావరి తీరాన్ని పులకింపచేశారు. నాలుగురోజుల పాటు గోదావరి తీరం సంగీత, నృత్యాలతో పులకించనుంది. రోజుకు వంద మందికి పైగా కళాకారులు ఒకే వేదికపై తమ నాట్య, సంగీత ప్రదర్శనతో నగర వాసుల పరవశులను చేయనున్నారు. దానికి రివర్ బే వద్ద గల ఆహ్వానం ఫంక్షన్ హాల్ వేదిక అయ్యింది. గత 43 సంవత్సరాలుగా కళా సమ్మేళన్ పేరుతో సంగీత, నృత్యోత్సవాలు శ్రీరాధాకృష్ణ కళాక్షేత, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 44వ కళా సమ్మేళన్ అంతర్జాతీయ సంగీత, నృత్య ఫెస్ట్ – 2026ను మంత్రి కె.దుర్గేష్ ప్రారంభించారు. ఈ కళా సమ్మేళన్లో 13 రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు.
నేడు 155 మంది కళాకారులతో నృత్య నీరాజనం
శుక్రవారం 155 మంది 9 గంటల 9 నిమిషాల 9సెకండ్ల పాటు నిర్విరామంగా ఒకే ఆహార్యంతో 108 అన్నమయ్య సంకీర్తనా వైభవం నృత్య ప్రదర్శనలు ఇస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో జరిగే విధంగా 18 సేవలను ప్రత్యక్షంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీరితో పాటుగా 9మంది సంగీత విద్యాంసులు కూడా పాల్గొననున్నారు. 13వ తేదీ 13గ్రూపులు పోటీ పడనున్నాయి. ఒక్కొక్క గ్రూప్లో 25 నుంచి 30 వరకు కళాకారులు ఉంటారు. 14వ తేదీ సోలో పోటీలు, సర్టిఫికెట్లు ప్రధానం చేయనున్నారు. ఈ బృందాలకు పర్యవేక్షకురాలిగా ప్రముఖ నాట్యాకారిణి లక్ష్మీదీపిక వ్యవహరిస్తున్నారు. గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 90 మంది నాట్యకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరికి బహమతులను అందజేశారు.


