కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలోని పలు జ్యూస్, రోజ్మిల్క్, టీ దుకాణాల్లో బుధవారం ఫుడ్ సేప్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ కె.సుప్రియ, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో ఆహార, పానీయాల నాణ్యత, తయారీ విధానాలు, నిల్వ పరిస్థితులు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ తనిఖీల్లో కొన్ని దుకాణాల్లో వినియోగిస్తున్న పదార్థాలు, మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా ఫ్రూట్ జ్యూస్లు, రోజ్మిల్క్ తయారీలో ఉపయోగిస్తున్న కొన్ని పదార్థాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం కావడంతో నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపామన్నారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం నిబంధనల ఉల్లంఘించినట్టు తేలితే సంబంధిత నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు, పానీయాలు విక్రయాలు గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, 08645 2410295 కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.


