సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కడియంలోని మహిళా శక్తి సమాఖ్య భవనం, రూరల్ మండలంలో కోలమూరులో సొసైటీ భవనాల్లో టీడీపీ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్కిరణ్ ముఖ్యఅతిథిగా ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏ అభ్యంతరాలు ఉండవు. కానీ టీడీపీ తరఫున పార్టీ కండువాలు, ఐడీ కార్డులు ధరించి మరీ నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు దొంగ నిద్ర నటిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడియం మండల పరిషత్ కార్యాలయంల ఆవరణలో ఉన్న మహిళా శక్తి భవనానికి మరోవైపు సరిహద్దులో తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. అక్కడే ఈ కార్యక్రమం నిర్వహించడం చర్చనీయాంశమైంది.


