సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాలు – 2027ను దృష్టిలో ఉంచుకుని జిల్లాను పర్యాటకంగా, విద్య, ఉపాధి, మౌలిక వసతుల రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి పలు అభివృద్ధి ప్రతిపాదనలు వివరించారు. ఎంపీ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను జిల్లాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చే అవకాశంగా వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా నుంచి పంపే ప్రతి అభివృద్ధి ప్రతిపాదనకు సమగ్ర డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ పర్యాటక, విద్య, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు, సీఎస్ఆర్ ద్వారా ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతులకు కార్యాచరణ చేపట్టినట్టు వివరించారు. పాండవమెట్ట, పిచ్చుకలంక, హ్యావ్లాక్ వంతెన, గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్, పర్యావరణహిత మౌలిక వసతులు, సందర్శకుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ వై.మేఘ స్వరూప్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ప్రాంతీయ పర్యాటక అధికారి ఎన్వీవీఎస్ మూర్తి, ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె. తిలక్ కుమార్, జిల్లా అటవీ అధికారి బి.ప్రభాకరరావు వివిధ శాఖల జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.


