అనుమతి లేని నిర్మాణాలను అడ్డుకోండి
కొవ్వూరులో మత్స్యకారుల ఆందోళన
తాళ్లపూడి: గోదావరి నది సమీపంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టి తమ పొట్టకొట్టొద్దని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దీనిపై మత్స్యకారులకు, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి టీవీ రామారావు మధ్య వివాదం నెలకొంది. కొవ్వూరులోని గోదావరి గట్టు రావణబ్రహ్మ శివాలయం సమీపం శ్రీనివాస స్నానఘట్టం వద్ద ఏపీ టూరిజం ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రామారావు చేపట్టగా మత్స్యకారులు అడ్డుకున్నారు. టూరిస్ట్ బోట్లు నిలపడానికి అక్రమ కట్టడాలను కట్టి వంద కుటుంబాలకు బతుకుదెరువు పోగొడుతున్నారని వారు అన్నారు. వెంటనే అక్రమ కట్టడాలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. దీనిపై మత్స్యకారుల సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే ఆపాలని కొవ్వూరు తహసీల్దార్ దుర్గాప్రసాద్ ఆదేశించారు. మత్స్యకారులు మాట్లాడుతూ తమ ముత్తాతల నుంచి ఇదే వృత్తిగా బతుకుతున్న తమ పొట్ట కొట్టవద్దని అన్నారు. అంతేకాకుండా తమ పడవలను గోదావరిలోకి వెళ్లనీయడం లేదని వాపోయారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. అనుమతులు వచ్చాకే పనులు చేస్తామని రామారావు అంటున్నారు.
అనుమతి లేని నిర్మాణాలను అడ్డుకోండి


