భార్యను హతమార్చిన భర్త
అనపర్తి: బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ బాలికపై టీడీపీ నాయకుడి కుమారుడు లైంగిక దాడికి యత్నించిన ఘటనను మరువక ముందే అదే గ్రామంలో.. అదే పార్టీకి చెందిన ఓ కార్యకర్త తన భార్యను దారుణంగా హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త దొనకొండ దుర్గయ్య తన భార్య జ్యోతి (32) తలపై బలమైన వస్తువుతో మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతడిని బంధువులు బిక్కవోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
తన అక్క కుమార్తె జ్యోతిని దుర్గయ్య పన్నెండేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు మగ పిల్లలు. కొంత కాలంగా భర్తతో విభేదాల కారణంగా జ్యోతి అదే గ్రామంలోని తన పుట్టింట్లో తల్లి వద్ద ఉంటోంది. నెల రోజుల క్రితం కుల పెద్దల సూచనల మేరకు భర్తతో కాపురానికి వెళ్లింది. ఎప్పటిలానే భర్త, అతడి అన్నదమ్ములు పెడుతున్న వేధింపులు భరించలేక తిరిగి పుట్టింటికి వచ్చేసింది. పెద్దాపురంలోని ఓ రొయ్యల ఫ్యాక్టరీలో జ్యోతి పని చేస్తోంది. రోజూ మాదిరిగానే ఫ్యాక్టరీ నుంచి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి వస్తోంది. అదే సమయంలో దుర్గయ్య, మరికొంత మంది రెండు మోటార్ సైకిళ్లపై వచ్చి, ఆమె చేతి వేళ్లు వెనుకకు విరిచి, తలపై బలమైన వస్తువుతో కొట్టి, పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేసి, తొక్కేశారని జ్యోతి తల్లి మంగ చెబుతోంది. దుర్గయ్య వారం పది రోజులుగా తనను, తన భర్తను, కుమార్తె జ్యోతిని వేధిస్తున్నాడని బిక్కవోలు పోలీస్ స్టేషన్లో చెప్పినా స్పందించ లేదని మంగ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్థానిక టీడీపీ గ్రామ శాఖ నాయకుడి అండతోనే తన కుమార్తెను దుర్గయ్య హత్య చేశాడని ఆరోపించింది. తన కుమార్తెను తన తమ్ముడే చంపాడంటూ మంగ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. తమ్ముడు, కూతురు కళ్ల ముందే అన్యోన్యంగా ఉంటారని ఆశ పడి వివాహం జరిపించామని, కానీ విధి వక్రించి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన తమ్ముడి చేతిలోనే బలైందని విలపించింది. పురుగు మందు తాగిన తమ్ముడెలా ఉన్నాడో అంటూ కన్నీరు పెట్టుకుంది. తల్లి మరణించి, తండ్రి ఆస్పత్రి పాలవ్వడంతో ఏం జరిగిందో తెలియక చిన్నారులు ఆడుకుంటున్న తీరు స్థానికులను ఆవేదనకు గురి చేసింది. ఇదిలా ఉంటే జ్యోతి హత్యపై ఆమె అన్న తంగెళ్ల మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
ఫ అనంతరం ఆత్మహత్యాయత్నం
ఫ నిందితుడు టీడీపీ కార్యకర్త
ఫ కొద్ది రోజులుగా
వేధిస్తున్నాడంటున్న హతురాలి తల్లి
ఫ పోలీసులకు చెప్పినా
పట్టించుకోలేదని ఆవేదన
భార్యను హతమార్చిన భర్త
భార్యను హతమార్చిన భర్త
భార్యను హతమార్చిన భర్త


