అధినేతతో ఆత్మీయ కలయిక
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.
– దేవరపల్లి
ట్రాక్టర్ కిందపడి
బాలిక దుర్మరణం
దేవరపల్లి: గొల్లగూడెం వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ చిన్నారి దుర్మరణం పాలైంది. పోలీసుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం సమిశ్రగూడేనికి చెందిన యామవరపు రమేష్, లక్ష్మి దంపతుల కుమార్తె స్మైలీ (11) నల్లజర్లలోని ఓ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. తల్లి దుబాయ్కి వెళ్లడంతో దేవరపల్లి మండలం యర్నగూడెంలోని తన పిన్ని ఇంటి వద్ద ఉండి చదువుకుంటోంది. తండ్రి రమేష్ పొగాకు బంటా పనుల నిమిత్తం ధుమంతునిగూడెంలో ఉంటున్నాడు. రెండు రోజుల కిందట స్మైలీ తండ్రి వద్దకు వచ్చింది. గురువారం రమేష్తో ఆ బాలిక ట్రాక్టర్పై పొలానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ జారి ట్రాక్టర్ చక్రాల క్రింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్మైలీ మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గోపాలపురం సీహెచ్సీకి తరలించి, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ‘తలశిల’కు
మాజీ మంత్రుల పరామర్శ
దేవరపల్లి: వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురాంను మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత గురువారం పరామర్శించారు. రఘురాం తండ్రి చంద్రశేఖర్రావు బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ గొల్లపూడిలోని నివాసంలో రఘురాంను, కుటుంబ సభ్యులను వేణు, వనిత కలసి ఓదార్చారు. చంద్రశేఖర్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వనిత వెంట పార్టీ నల్లజర్ల మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సత్తి సాయి ఈశ్వరరెడ్డి, మహిళా విభాగం దేవరపల్లి మండల అధ్యక్షురాలు కడలి హైమావతి ఉన్నారు.
చార్విక చికిత్సకు
దాడిశెట్టి రాజా ఆర్థిక సాయం
తొండంగి: కాలేయ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి చార్విక చికిత్సకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గురువారం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. కోన ప్రాంతానికి చెందిన చార్విక చికిత్స నిమిత్తం అద్దరిపేటకు చెందిన యువత దాతలను ఆశ్రయించి విరాళాలు సేకరిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ఈ విషయం గమనించిన దాడిశెట్టి రాజా తన వంతు సాయాన్ని తుని లోని తన కార్యాలయంలో అద్దరిపేట యువతకు, చిన్నారి కుటుంబ సభ్యులకు అందించారు.
రూ.10 లక్షల గంజాయి పట్టివేత
వై.రామవరం: అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి కథనం ప్రకారం.. సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నుంచి మండలంలోని కోట, చవిటిదిబ్బలు గ్రామాల మీదుగా రాజమహేంద్రవరానికి మినీ వ్యాన్లో గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది. ఈ మేరకు, వై.రామవరం ఎస్సై ఎస్.పృథ్వీయాదవ్ ఆధ్వర్యాన సిబ్బంది చవిటిదిబ్బలు గ్రామ జంక్షన్లో బుధవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వ్యాన్తో పాటు 50 కేజీల గంజాయి పట్టుబడింది. దానిని రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన బాబుల్ హంతాల్, ముబారాజ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని రాజమహేంద్రవరం తీసుకు రావాలని వీరిద్దరికీ మరో ఇద్దరు చెప్పారు. ఆ ఇద్దరూ ముందుగానే రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. పట్టుబడిన ఇద్దరినీ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
అధినేతతో ఆత్మీయ కలయిక
అధినేతతో ఆత్మీయ కలయిక


