
జూనియర్ మహిళల హాకీ పోటీలు ప్రారంభం
ఈ నెల 10 వరకు నిర్వహణ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడామైదానంలో 12 రోజుల పాటు జరగనున్న 15 వ జాతీయ జూనియర్ బాలికల హాకీ పోటీలను శుక్రవారం రాత్రి కలెక్టర్ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో డబుల్ ఒలింపియన్, ధ్యాన్చంద్ అవార్డు గ్రహీత ఎస్.గీత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించగా, ఇండియన్ హాకీ పతాకాన్ని ఎస్.గీత, ఇండియన్ హాకీ సెలెక్షన్ కమిటీ సభ్యులు ఆసుంటా లక్రా ఆవిష్కరించారు. ఈ పోటీలలో 30 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. 2026–27 సంవత్సరానికి మహిళా హకీ వరల్డ్ కప్లో పాల్గొనే భాతర జట్టును ఈ టోర్నీలో ఎంపిక చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో అతిథులుగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, రాజబాబు, కుడా చైర్మన్ టి.రామస్వామి, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ మీనా, ఎస్పీ బిందుమాధవ్, అడిషనల్ ఎస్పీ మానిష్; డీఎఫ్ఓ రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా క్రీడామైదానంలో ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు. 18 జట్ల క్రీడాకారులు మార్చ్పాస్ట్ నిర్వహించారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ ఈ టోర్నీ క్రీడాకారులకు మధుర స్మృతిగా నిలుస్తుందన్నారు. టోర్నీ కోఆర్డినేటర్ రవిరాజు, డీఎస్డీఓ శ్రీనివాస్కుమార్, ఆర్డీఓ మల్లిబాబు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు
కాకినాడ జిల్లా క్రీడామైదానంలో శుక్రవారం ప్రారంభమైన 15వ జాతీయ జూనియర్స్ మహిళల హాకీ పోటీలలో భాగంగా తొలిరోజు ఏ డివిజన్లో గోయన్స్ హాకీ, జమ్మూకాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్లో గోయన్స్ హాకీ జట్టు 2–1 స్కోర్తోను, తెలంగాణ, గుజరాత్ మధ్య నిర్వహించిన మ్యాచ్లో గుజరాత్ 4–1 స్కోర్తోను, మిజోరామ్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో మిజోరాం12–0 స్కోర్తోను విజయం సాధించాయి.
బి డివిజన్లో మణిపూర్, కేరళ మధ్య జరిగిన మ్యాచ్లో మణిపూర్ 5–0 స్కోర్తోను, అస్సాం, పాండుచ్చేరి మధ్య జరిగిన మ్యాచ్లో అస్సాం 5–0 స్కోర్తోను, హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో అరుణాచల్ప్రదేశ్ 6–2 స్కోర్తోను విజయం అందుకున్నాయి. ఢిల్లీ, హాకీ అసోసియేషన్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6–3 స్కోర్తోను విజయం సాధించాయి. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్లను టోర్నీ కో–ఆర్డినేటర్ వి.రవిరాజు పర్యవేక్షించారు.

జూనియర్ మహిళల హాకీ పోటీలు ప్రారంభం