
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం
అమలాపురం టౌన్: ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు మద్దాల బాపూజీ అన్నారు. అమలాపురంలోని గొల్లగూడెంలో జిల్లా ప్రభుత్వ సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఎరియర్స్, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు.. ఇలా పలు రూపాల్లో రూ.వేల కోట్లలో ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. జిల్లాలో ఈ నెల 5 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ బకాయిలపై గణాంకాలతో వివరించే వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు పలు ఎరియర్స్ కింద ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్ల వరకూ బకాయిలు ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు వారి బాధ్యతలు తెలియజేసి, వారిని పోరాటంలో కార్యోణ్ముఖులను చేసేందుకు ‘ఉద్యోగులారా... రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరుతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎరెండ్స్ లీవులు బకాయిలు చెల్లించలేదని, పీఆర్సీ కమిటీ నియమించలేదని, నాలుగు డీఏలు నేటికీ ఇవ్వలేదన్నారు. ప్రతి ఉద్యోగికి ఎంత చెల్లించాలో ప్రభుత్వం నిర్ధారించాలని, బకాయిలు ఎంత ఇవ్వాలో ఉద్యోగి రిజిస్టర్ (ఎస్ఆర్)లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పలు ఎరియర్స్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో లిఖిత పూర్వకంగా రాసి ష్యూరిటీ బాండ్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ కె.వీరబాబు, జిల్లా కార్యదర్శి కె.మల్లిబాబు, ఉపాధ్యక్షుడు సీహెచ్ విజయ్కుమార్, కోశాధికారి జేఏ రాజ్కుమార్, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, మండపేట ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ నెల 5 నుంచి శాఖల
వారీగా సమావేశాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ
జిల్లా అధ్యక్షుడు బాపూజీ