
శ్రీనివాసా... శ్రీవేంకటేశా
కొత్తపేట: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. శనివారంతో పాటు ఏకాదశి కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణల నోము ఆచరిస్తున్న భక్తుల గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించారు. అర్చకుల ఆశీర్వచం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈఓ చక్రధరరావు క్యూలైన్లో భక్తులతో సాధారణ భక్తునిలా కలసిపోయి వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. భక్తులతో పాటే స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాద విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.60,17,180 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు నేడు కౌన్సెలింగ్
రాయవరం: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు ఆదివారం కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి నుంచి సమాచారం అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న బదిలీ కౌన్సెలింగ్లో భాగంగా ఉదయం 9 గంటలకు 2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు, మధ్యాహ్నం 12 గంటలకు 1998 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
● భక్తజనంతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం
● ఒక్క రోజే రూ.60.17 లక్షల ఆదాయం