
ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ లీజులు రద్దు చేయాలి
తుని: ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్కు ఇచ్చిన లీజులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు జక్కంపూడి రాజు డిమాండ్ చేశారు. శనివారం తునిలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఆదివాసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మైదాన ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీలో కలపాలని, శంఖవరం మండలం పెదమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 యాక్ట్కు ఎటువంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ మాఫియాను అరికట్టి, ఆదివాసీలపై జరుగుతున్న కగారు ఆపరేషన్ తక్షణం నిలుపుదల చేసి, అక్రమ కేసుల్లో ఇరికించిన ఆదివాసీలను విడుదల చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులు, ఆదివాసీలను అడవుల నుంచి ఖాళీ చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను వలస భూస్వాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని, వీరి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే నెల 13, 14 తేదీల్లో అన్నవరంలో రాష్ట్ర స్థాయి వర్క్షాపు నిర్వహించేందుకు నిర్ణయించారు. అనకాపల్లి జిల్లా కన్వీనర్ మోసూరి రాజు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సన్యాసిరావు, మన్యం జిల్లా నుంచి కర్ర ఏసు, కాకినాడ జిల్లా నుంచి రేచుకట్ల సింహాచలం, ముసలయ్య, బాలరాజు, పందిరి ప్రసాద్ పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.జనార్దన్లు ఆదివాసీ సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.