
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
ఉండ్రాజవరం: భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మండలంలోని మోర్త గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఉండ్రాజవరం ఏఎస్సై కె.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో మోర్త గ్రామానికి చెందిన పుల్లూరి నాగేశ్వరరావుతో నిడదవోలు మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి సంధ్య(22)కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సహస్ర, బాల శ్రీవల్లి ఉన్నారు. ఈ నెల 19వ తేదీన భార్యాభర్తలు తగదా పడ్డారు. శుక్రవారం ఉదయం భర్త పొలానికి వెళ్లేముందు తనతో మాట్లాడటం లేదని మనస్థాపానికి గురైన సంధ్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం వెళ్లిన భర్త నాగేశ్వరరావు బయట హోటల్ నుంచి టిఫిన్ తీసుకుని ఇంటికి రాగా.. బెడ్రూమ్లో భార్య ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించి, వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించగా ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి కరింకి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రామకృష్ణ తెలిపారు.