పండూరులో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

పండూరులో భారీ చోరీ

Jun 20 2025 5:51 AM | Updated on Jun 20 2025 5:51 AM

పండూరులో భారీ చోరీ

పండూరులో భారీ చోరీ

కాకినాడ రూరల్‌: మండలంలోని పండూరు గ్రామంలో గరగా విజయ శ్రీభాస్కరరావు(పెదకాపు) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు లోపలకు ప్రవేశించి బీరువాలోని విలువైన బంగారు, వెండి ఆభరణాలు దోచుకుపోయారు. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పండూరు రామాలయం వీధిలో నివాసం ఉంటున్న పెదకాపు భార్య వెంకట పద్మ, ఆమె చిన్న కుమారుడితో కలిసి పెద్దాపురం మండలం గోరింట పుట్టింటికి ఈ నెల 17న వెళ్లారు. అదే రోజు పెదకాపు వైజాగ్‌ వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం వెంకట పద్మ, చిన్న కుమారుడు వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కంగారు పడి పరిశీలించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన చోరులు బీరువాలోని సుమారు 51 గ్రాముల బంగారు, 1,200 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు కొంత మొత్తంలో నగదు దోచుకుపోయినట్టు గుర్తించారు. జరిగిన ఘటన గురించి తిమ్మాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు తిమ్మాపురం స్టేషన్‌ అదనపు ఎస్సై ఆర్‌వీఎన్‌ మూర్తి కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ సభ్యులు వివరాలు సేకరించారు. బుధవారం రాత్రి చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా చోరీ మొదటి అంతస్తులో జరగగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పెదకాపు పెద్ద కుమారుడు ఉంటున్నాడు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉండగానే పై ఫ్లోర్‌లో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మూర్తి తెలిపారు.

ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో దొంగతనం

సుమారు రూ.4 లక్షల విలువైన

బంగారు, వెండి ఆభరణాల అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement