
తొమ్మిది మందికి రిమాండ్
ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో జరిగిన పరస్పర దాడులకు సంబంధించి తొమ్మిది మంది నిందితులకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రిమాండు విధించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక యర్ర కాలనీ సమీపంలో ఈ నెల 15వ తేదీ రాత్రి పెనికేరుకు చెందిన కె.రోహిత్, చింతలూరుకు చెందిన పి.తేజ వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ సందర్భంగా ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై 15 మంది నిందితులను గుర్తించి సోమవారం కేసు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే అరెస్ట్ చేసిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఐ.ప్రవీణ్ కుమార్ 15 రోజుల రిమాండు విధించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు.
వెళ్లింది 31 మంది... వచ్చింది 50 మంది
నర్సింగ్ ఆఫీసర్ల కౌన్సెలింగ్ పూర్తి
కాకినాడ క్రైం: సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జీజీహెచ్లోని కమ్యూనిటీ హాల్లో వెబ్ ద్వారా నిర్వహించిన ఈ ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పర్యవేక్షించారు. జీజీహెచ్లో తొలి నుంచి 24 ఖాళీ స్టాఫ్ నర్సుల పోస్టులు ఉండగా, ఉన్న వారి నుంచి 31 మంది బదిలీ అయ్యారు. దీంతో మొత్తం 55 ఖాళీలు ఏర్పడ్డాయి. మంగళవారం నాటి కౌన్సెలింగ్ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది స్టాఫ్ నర్సులు కొత్తగా కాకినాడ జీజీహెచ్కు బదిలీ అయ్యారు. దీంతో సింహభాగం భర్తీ అయి, మరో ఐదు ఖాళీలు మిగిలాయి. అలాగే, జీజీహెచ్లో పనిచేస్తున్న హెడ్ నర్సులు 9 మంది బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఒక్కరు కూడా చేరలేదు. స్టాఫ్ నర్సులకు పదోన్నతులు వచ్చే వరకు ఈ స్థానాలు భర్తీ అయ్యే ప్రసక్తే లేదు. ఈ పరిస్థితి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేషన్ సీనియారిటీని అనుసరించి బదిలీ అయిన వీరంతా రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లారు. అలాగే నర్సింగ్ ట్యూటర్లలో ఓ పోస్టు రిటెన్షన్ అయి దరఖాస్తుదారు అదే స్థానంలో కొనసాగనున్నారు. మరో పోస్టు ఖాళీగా ఉండగా తాజా బదిలీలో భర్తీ అయ్యింది.