
పొట్టి శ్రీరాములు వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభించాలి
రాజమహేంద్రవరం సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి వెంటనే వైస్ చాన్సలర్ను, రిజిస్ట్రార్ను నియమించి అడ్మిషన్లు ప్రారంభించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీ.కే.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. జూన్ నెల 15వ తేదీ దాటిందని, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయంలో ఉన్న కోర్సులన్నింటిని ఇక్కడ కూడా ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖా మంత్రి నారా లోకేష్తో మాట్లాడి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ పనిని చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై ఉందన్నారు. పురపాలక శాఖా మంత్రితో మాట్లాడి చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాన్ని తేవాలని, కడప, కర్నూలు కంటే ఆ ప్రాజెక్టు అవసరం రాజమహేంద్రవరం నగరానికి ఎక్కువగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూరల్లో స్థలం ఇచ్చి వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న మురికి నీటి శుద్ధి కర్మాగారం పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్ధుల్లా షరీఫ్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు.