
గర్భస్థ శిశువు నిర్ధారణపై సమగ్ర విచారణ
అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచనలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గర్భస్థ శిశువు నిర్ధారణ చేయడం, లింగ ఎంపిక నిషేధం వంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రశాంతి అధికారుకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బహుళ సభ్యుల సాధికార కమిటీ, జిల్లా సలహా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గర్భస్త శిశువు నిర్ధారణ పరీక్షలు చేయడం, అబార్షన్, పోస్ట్ అబార్షన్ కోసం వాడే మందుల వినియోగంపై ప్రతి నెలా డ్రగ్స్ కంట్రోలర్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో ఒక ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారిలో ఎంతమందికి అబార్షన్ చేశారు అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. డెకాయిట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్కానింగ్ సెంటర్స్ విషయంలో కొత్తగా అనుమతులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటికి రెన్యువల్, సవరణల విషయంలో నియమ నిబంధనలు, అర్హతలపై దృష్టి సారించాలన్నారు. ఏదైనా స్కానింగ్ సెంటర్కి అనుమతులు ఇచ్చే క్రమంలో నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు లోబడే ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.