డబ్బులెప్పుడిస్తావ్‌ బాబూ! | - | Sakshi
Sakshi News home page

డబ్బులెప్పుడిస్తావ్‌ బాబూ!

Jun 17 2025 5:06 AM | Updated on Jun 17 2025 5:06 AM

డబ్బు

డబ్బులెప్పుడిస్తావ్‌ బాబూ!

రెండు నెలలుగా ధాన్యం సొమ్ము

ఇవ్వని సర్కారు

ప్రారంభమైన ఖరీఫ్‌

పెట్టుబడి కోసం రైతుల ఇక్కట్లు

బకాయిలపై నోరు మెదపని ప్రభుత్వం

సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసి చాలా రోజులే అయ్యింది. ధాన్యం సేకరణ ఆపేసి, కొనుగోలు కేంద్రాలను సర్కారు మూసేసింది కూడా. రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మి దాదాపు రెండు నెలలు కావస్తోంది. కానీ, ఇప్పటికీ వారికి ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని కూటమి పెద్దలు గొప్పగా చెప్పారు. ఆ మాటలు నమ్మితే చివరకు తమను నిలువునా ముంచారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రబీ ధాన్యం డబ్బులు రాక.. అన్నదాతా సుఖీభవ సాయం ఇవ్వకపోవడంతో.. సార్వా సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 428 హెక్టార్లలో నారుమళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం అమ్మిన డబ్బులు ఎప్పుడిచ్చేదీ ప్రభుత్వం చెప్పకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. సాగు పెట్టుబడులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న పరిస్థితులే పునరావృతమవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. చేసేది లేక ప్రైవేటు వ్యక్తుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు.

రూ.129 కోట్లు పెండింగ్‌

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని కూటమి నేతలు ఊరూవాడా డప్పేసి గొప్పలు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు జరిగింది. 5.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 60 వేల మెట్రిక్‌ టన్నులు ఫైన్‌ వైరెటీ. మిగిలిన 4.51 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించింది. ఆ మేరకు 216 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించారు. 2,63,076 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించిన అనంతరం లక్ష్యం అధిగమించామని చెప్పి, అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళన బాట పట్టారు. రహదారులపై బైఠాయించారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం మరో లక్ష టన్నుల ధాన్యం సేకరణకు అనుమతిచ్చింది. ఆ మేరకు 30,448 మంది రైతుల నుంచి రూ.812.4 కోట్ల విలువైన 3,53,199.280 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, కొనుగోలు కేంద్రాలను మూసేసింది. ఇక సేకరించబోమని చెప్పేసింది. ధాన్యం కొనుగోళ్లలో తొలి లక్ష్యం 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణను అధికారులు ఏప్రిల్‌ 22వ తేదీ నాటికి పూర్తి చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.682.49 కోట్లు మంజూరు చేసింది. అదనంగా కొన్న లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించడం లేదు. మొత్తం రూ.129.91 కోట్లు విడుదల చేయకుండా రైతులను నానా తిప్పలూ పెడుతోంది. ధాన్యం డబ్బులు ఎప్పుడొస్తాయని అధికారులను ప్రశ్నిస్తే.. వచ్చే వారం అంటూ తప్పించుకుంటున్నారే తప్ప.. స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పలువురు రైతుల వద్ద లక్ష మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం మిగిలిపోయింది. దీనిని విక్రయించుకునేందుకు వారు అనేక పాట్లు పడుతున్నారు. ఇదే అదనుగా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

కొన్న ధాన్యం 3,53,199

మెట్రిక్‌ టన్నులు

విక్రయించిన రైతులు 30,448

అందించాల్సిన సొమ్ము రూ.812.4 కోట్లు

మంజూరు చేసినది రూ.682.91 కోట్లు

బకాయి రూ.129.91 కోట్లు

అప్పు చేసి నారుమడి వేశాం

నేను 3.50 ఎకరాలు కౌలు చేస్తున్నాను. మే నెల మొదటి వారంలో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) ద్వారా మిల్లుకు తోలాను. ఇప్పటి వరకూ నా ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో అప్పు చేసి ఖరీఫ్‌ సాగుకు నారుమడి వేశాను. ట్రాక్టర్‌తో పాటు ఎరువులు, పురుగు మందులు అరువు తెచ్చి, పెట్టుబడి పెట్టాను. కౌలు చెల్లించాలని పొలం యజమానులు కూడా అడుగుతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. రైతులకు వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వాలి.

– కామన కొండబాబు, రైతు, కోరుపల్లి,

నిడదవోలు మండలం

ప్రభుత్వం విఫలం

ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆది నుంచీ రైతులపై వివక్ష చూపుతూనే ఉంది. కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచీ ఇబ్బందులకు గురి చేస్తోంది. కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్న తరుణంలో అటు రైతుభరోసా అందక, ఇటు ధాన్యం డబ్బులు రాక అల్లాడిపోతున్నారు. ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే సుమారు రూ.10 కోట్లకు పైగా బకాయిలున్నట్లు తెలిసింది. వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించి, రైతులను ఆదుకోవాలి.

– తలారి వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ

కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి

డబ్బులెప్పుడిస్తావ్‌ బాబూ!1
1/2

డబ్బులెప్పుడిస్తావ్‌ బాబూ!

డబ్బులెప్పుడిస్తావ్‌ బాబూ!2
2/2

డబ్బులెప్పుడిస్తావ్‌ బాబూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement