
గుట్టక్కున మింగేసి..
● ఓపెన్ రీచ్లలో ఈ నెల 1 నుంచి
ఇసుక తవ్వకాల నిలుపుదల
● వర్షాకాలం కోసం జిల్లాలో
అధికారికంగా 29 స్టాక్ పాయింట్లు
● ఆ ముసుగులో కూటమి నేతల బరితెగింపు
● విచ్చలవిడిగా తవ్వకాలు
● అనధికారికంగా 50 వేల
క్యూబిక్ మీటర్ల మేర నిల్వలు
● కన్నెత్తి చూడని అధికారులు
పెరవలి: వర్షాకాలం ప్రారంభమవుతూండటంతో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అధికారులు జిల్లాలోని 22 ఓపెన్ రీచ్లలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. వర్షాకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని 18 బోట్స్మెన్ సొసైటీ (డీసిల్టేషన్) రీచ్ల ద్వారా ఇసుక తవ్వి, జిల్లాలోని 29 స్టాక్ పాయింట్లలో నిల్వ చేస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాలోని ఇసుక మాఫియా ముసుగులో కూటమి నేతలు గోదావరిని గుల్ల చేసి పారేస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి అనేక ప్రాంతాల్లో అక్రమంగా గుట్టలు గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. వర్షాకాలం, గోదావరి వరదల సమయంలో ఇసుక లభ్యత తగ్గితే అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ అక్రమ గుట్టలు సిద్ధం చేస్తున్నారు.
ఇవీ అధికారిక స్టాక్ పాయింట్లు
కొవ్వూరు మండలం కొవ్వూరు, ఆరికరేవుల–1, 2, చిడిపి–1, 2, కుమారదేవం–1, 2; తాళ్లపూడి మండలం ప్రక్కిలంక–1, 2, 3, వేగేశ్వరపురం, తాడిపూడి–1, 2, 3; నిడదవోలు మండలం పురుషోత్తపల్లి, జీడిగుంట, మునిపల్లి; పెరవలి మండలం కాకరపర్రు, తీపర్రు; సీతానగరం మండలం ములకల్లంక, మునికూడలి–1, 2, కాటవరం, వంగలపూడి–1, 2; రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం, కాతేరు; రాజమహేంద్రవరం అర్బన్ మండలం కోటిలింగాల–2; రంగంపేట మండలం వడిశలేరు ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వర్షాకాల అవసరాల కోసం ఓపెన్ రీచ్ల నుంచి తవ్వి, ఈ ప్రాంతాల్లో సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వ చేశారు. దీని కోసం ఏప్రిల్ నెలలోనే ఆదేశాలు ఇచ్చారు.
అక్రమార్కుల రంగప్రవేశం
ఇదే అదనుగా రంగప్రవేశం చేసిన కూటమి నేతలు పగలు అధికారిక స్టాక్ పాయింట్లకు ఇసుక తోలారు. రాత్రి వేళల్లో యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలించేశారు. దీనిని ముందుగా సిద్ధం చేసుకున్న ప్రాంతాల్లో గుట్టలుగుట్టలుగా భారీ ఎత్తున అక్రమంగా నిల్వ చేశారు. ఒక్కడ కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ర్యాంపులున్న ప్రతిచోటా అధికారిక గుట్టలతో పాటు అనధికారికంగా సుమారు 50 వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వ చేశారు. ఈ విషయాన్ని కూటమి నాయకులే బహిరంగంగా చెప్పుకొంటున్నారు. దాదాపు ప్రతి అధికారిక స్టాక్ పాయింట్ పరిధిలో అనధికారిక గుట్టలు జిల్లాలో అనేకం ఏర్పాటు చేశారు. పుంతగట్లు, ఆర్అండ్బీ రోడ్ల పక్కన, లే అవుట్లు, గృహ నిర్మాణాలు జరిగే ప్రాంతాలకు కొద్ది దూరంలోను, చేలలో మకాంల వద్ద, ఇళ్ల వద్ద సైతం ఈవిధంగా నిల్వ చేశారు. పెరవలి మండలం కానూరు, నడుపల్లి, నడుపల్లి కోట, తీపర్రు తదితర గ్రామాల్లో పెద్దపెద్ద ఇసుక గుట్టలు దర్శనమిస్తున్నాయి. ఈ వ్యవహారం తెలిసినప్పటికీ అక్రమార్కులు అధికార కూటమి నేతలే కావడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. దీని వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని, అందువల్లనే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

గుట్టక్కున మింగేసి..

గుట్టక్కున మింగేసి..

గుట్టక్కున మింగేసి..

గుట్టక్కున మింగేసి..

గుట్టక్కున మింగేసి..

గుట్టక్కున మింగేసి..