
కేతన్ గార్గ్ బదిలీ
రాజమహేంద్రవరం సిటీ: నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ గార్గ్ దాదాపు ఏడాది కాలం నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఇంకా ఎవ్వరినీ నియమించలేదు. కొత్త కమిషనర్ వచ్చేంత వరకూ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి కమిషనర్గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.
పీజీఆర్ఎస్కు 177 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 177 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రీ ఓపెన్ అవ్వకుండా పరిష్కరించాలని అన్నారు. ప్రజలు తమ సమస్యలపై 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, దీనిపై ప్రచారం చేయాలని సూచించారు.
అందరికీ మెరుగైన
ఆరోగ్యమే లక్ష్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అందరికీ మెరుగైన ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. సికిల్సెల్ ఎనీమియాపై సోమవారం తన చాంబర్లో ఆమె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సికిల్సెల్ ఎనీమియా గతంలో మన్యం ప్రాంతంలో ఉండేదని, ప్రభుత్వం అక్కడే వైద్య సేవలు అందించేదని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో 14,312 మంది గిరిజనులుండగా 7,574 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పి.కోమల తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలకు సంక్షేమ
పథకాలు అమలు చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం తక్షణం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.బేబీరాణి అన్నారు. కలెక్టరేట్ వద్ద సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలను సాధికార సర్వేల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొనడంతో వారికి సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు గాలికి వదిలేయడం సరికాదని అన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ ఇవ్వలేదని చెప్పారు. అనంతరం కలెక్టర్ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.పవన్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ మాణిక్యాంబ, ఉపాధ్యక్షులు సీహెచ్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ బదిలీలు పూర్తి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు, ఎస్జీటీలకు సంబంధించి 6,572 మంది బదిలీ అయ్యారన్నారు. జెడ్పీ పరిధిలో స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా 96 మంది, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 10 మంది పదోన్నతి పొందారని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలో సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 204 మందికి పదోన్నతి కల్పించామని రమేష్ తెలిపారు.

కేతన్ గార్గ్ బదిలీ

కేతన్ గార్గ్ బదిలీ