
అదీ ‘మ్యా(మీ)టర్’
● 300 యూనిట్ల పేరుతో
‘తల్లికి వందనం’ నిలిపివేత
● ఉన్న మీటరు ఒకటి
● 4 నుంచి 14 వరకూ ఉన్నట్లు స్టేట్మెంట్లు
● సామర్లకోటలో నిలదీసిన మహిళలు
సామర్లకోట: తల్లికి వందనం పథకానికి విద్యుత్తు బిల్లుల నిబంధనల సెగ తగిలింది. గడచిన ఆరు నెలలుగా 300 యూనిట్ల వాడకం లేనప్పటికీ తమకు తల్లికి వందనం పథకం నిలిపివేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు సోమవారం స్థానిక పిఠాపురం రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్కు తరలివచ్చారు. వేసవి కాలంలో ఎండలు మండిపోవడం, అదే సమయంలో శుభకార్యాలు జరగడంతో ఒక్క మే నెలలో మాత్రమే 300 యూనిట్ల బిల్లు వచ్చిందని, దానిని సాకుగా తీసుకోవడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. ఆరు నెలల సరాసరి తీసుకొని 300 యూనిట్లు దాటితే తల్లికి వందనం నిలిపివేసినా అభ్యంతరం లేదని అన్నారు. అనేక మందికి 4 నుంచి 14 వరకూ మీటర్లు ఉన్నట్లు స్టేట్మెంట్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో వాడుకుంటున్న విద్యుత్ మీటర్లు తమ పేరిట ఉండటమేమిటని ప్రశ్నించారు. ఇలా ఉన్న మీటర్లను గుర్తించి, బాధితుల పేర్లు తొలగిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏఈ రమేష్ కుమార్ చెప్పారు. ఆధార్ కార్డుల ప్రాతిపదికన విద్యుత్తు బిల్లులకు సంబంధించి అదనపు మీటర్లు ఉన్నట్లు గుర్తిస్తే రూ.30 చెల్లించి స్టేట్మెంట్ తీసుకోవడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి తొలగిస్తామని తెలిపారు. దీంతో, ఈ స్టేట్మెంట్ల కోసం విద్యుత్ వినియోగదారులు ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద బారులు తీరారు. విద్యుత్తు వాడుతున్న వారు వారి ఆధార్ కార్డులతో మీటరుకు లింక్ చేయించుకోవాలని ఏఈ సూచించారు. ఈ మేరకు విద్యుత్తు మీటర్లకు ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్తు వాడకం 300 లోపు యూనిట్లు ఉన్నవారికి స్టేట్మెంట్లు అందజేస్తామని చెప్పారు. అయితే, తల్లికి వందనం అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఆలోగా విద్యుత్ వాడకానికి సంబంధించిన స్టేట్మెంట్లు రాకపోతే తమకు అన్యాయం జరుగుతుందని తల్లులు ఆవేదన చెందుతున్నారు.
అమలాపురంలో
విపత్తుల స్పందన దళం స్థావరం
అమలాపురం టౌన్: జిల్లాలో తరచుగా సంభవించే తుపాన్లు, గోదావరి వరదలు, చమురు సంస్థల గ్యాస్ లీకేజీ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే ఆదుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విపత్తుల స్పందన దళం స్థావరాన్ని అమలాపురంలో నెలకొల్పుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వెనుక గల పాత సబ్ జైలు భవనంలో ఈ స్థావరం నెలకొల్పాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ జైలు భవనాన్ని కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ స్థావరంలో దళం నివాసం ఉండి రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సంసిద్ధమై ఉంటుందన్నారు. తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్తోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.