
భళీ.. నృత్యకేళి
అలరించిన నృత్య రూపకం
● ముగిసిన అంతర్జాతీయ
కళా సమ్మేళన్–2025
● ప్రతిభ చూపిన 13 బృందాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): తెలుగు సంస్కృతీ వైభవానికి కేంద్రమైన రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాభిమానులు నాలుగు రోజుల పాటు సంగీత, నృత్యానందఝరుల్లో ఓలలాడారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గురువారం ప్రారంభమైన కళా సమ్మేళన్–2025 అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. దేశంలోని 13 రాష్ట్రాలతో పాటు మలేషియా నుంచి వచ్చిన 750 మంది కళాకారులు 13 బృందాలుగా ఈ సంగీత, నృత్య పోటీల్లో పాల్గొని, కళాభిమానులకు నేత్రానందాన్ని కలిగించారు. తొలి రోజు వంద మంది నృత్యకారిణులు పురివిప్పిన మయూరాల్లా నర్తించి, వీక్షకులను అలరించారు. రెండో రోజున శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకెన్లకు గురువాష్టకం, మీనాక్షీ పంచరత్న స్తోత్రాలకు ఏకధాటిగా సాయంత్రం 6 గంటల వరకూ నర్తించారు. దీనికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ పినాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరించాయి. మూడో రోజైన శనివారం ప్రదర్శించిన డ్యాన్స్ బాలేకి ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి వినోద్ త్యాగి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గోపాల్ అగర్వాల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. చివరి రోజైన ఆదివారం జూనియర్, సబ్ జూనియర్ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాజమహేంద్రవరం శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నృత్యకారులు ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణానికి ఈ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన గోదా కళ్యాణానికి ద్వితీయ, గుడివాడ బృందం ప్రదర్శించిన నవదుర్గలకు తృతీయ బహుమతులు లభించాయి. వీటితో పాటు అయ్యప్ప మహాత్మ్యం, పార్వతీ కల్యాణం, మోహినీ భస్మాసుర, కృష్ణలీలలు, శ్రీనివాస కల్యాణం, సనాతన శక్తి వైభవం, నమో వెంకటేశాయ, గోదా కల్యాణం తదితర ప్రదర్శనలకు సర్టిఫికెట్లు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.
నాట్యానికి మంచి
రోజులొస్తున్నాయి
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరం గౌరవిస్తోంది. భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ తీసుకోవడానికి చిన్నారులు సైతం ముందుకు రావడమే దీనికి నిదర్శనం. భారతీయ నృత్య రీతుల పట్ల నేటి తల్లిదండ్రులకు మంచి అభిప్రాయం ఉంది. ఇది శుభపరిణామం. కూచిపూడి నృత్యాన్ని నేటి తరం తెలుసుకోవాలనే సంకల్పంతో 63 రోజుల పాటు 22 రాష్ట్రాల్లో 17 వేల కిలోమీటర్లు ప్రయాణించాను. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి, ఈ అపూర్వ కళకు పూర్వ వైభవం తీసుకురావడానికి 2003లో భగీరథ ప్రయత్నం తలపెట్టాం. ఇప్పుడు కళాసమ్మే ళన్–2025 ద్వారా వందల మంది శాసీ్త్రయ నృత్యాలు ప్రదర్శించారు. వీటిని తిలకించి మరికొంత మంది నృత్యం నేర్చుకుంటే నా జన్మ ధన్యమైనట్లే.
– డాక్టర్ జి.బదరీ నారాయణ,
నిర్వాహకుడు, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం

భళీ.. నృత్యకేళి

భళీ.. నృత్యకేళి