అన్నంత సేవ | - | Sakshi
Sakshi News home page

అన్నంత సేవ

Jun 16 2025 5:59 AM | Updated on Jun 16 2025 5:59 AM

అన్నం

అన్నంత సేవ

రోజూ మూడు వేల మందికి అన్నదానం

దాతల సహకారంతో నిర్మలగిరిలో సేవ

24 ఏళ్లుగా కొనసాగుతున్న కార్యక్రమం

దేవరపల్లి: మది నిండా భక్తితో.. ఎక్కడెక్కడి నుంచో.. ఆ నిర్మలగిరికి వస్తున్న భక్తుల ఆకలి తీర్చే నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది.. భక్తులు, దాతల విరాళాలతో నిత్యం ఈ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోంది. ఈ సేవ 24 ఏళ్లుగా సాగుతుండడం ప్రాముఖ్యతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వద్ద ప్రత్యేకత ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ పుణ్యక్షేత్రానికి దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. వారి ఆకలి తీర్చడానికి ఏలూరు మేత్రాసనం పీఠాధిపతులు మోస్ట్‌ రెవరెండ్‌ జయరావు పొలిమెర ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రం డైరెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ ఎస్‌.జాన్‌పీటర్‌ పర్యవేక్షణలో నిత్యాన్నదానం విజయవంతంగా జరుగుతోంది.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ..

నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో 2020–21లో అప్పటి డైరెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ ఆరోన్‌ దిరిసిన ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొండపైన ఉన్న క్రీస్తు ఆలయం సమీపంలో అన్ని వసతులతో కూడిన సువిశాల భోజనశాల నిర్మించారు. భోజన శాలను అప్పటి ఏలూరు పీఠాధిపతులు రెవరెండ్‌ జాన్‌ములగాడ ప్రారంభించారు. తొలుత 200 మందితో ప్రారంభించి... నేడు వేలాది మంది భక్తుల ఆకలి తీర్చుతున్నారు. రోజూ మూడు వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తుండగా, ఆదివారం సుమారు పది వేల మందికి జరుగుతోంది. సుమారు 24 ఏళ్లుగా నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతుంది. డైరెక్టర్‌ ఫాదర్‌ జాన్‌పీటర్‌ పర్యవేక్షణలో కళ్లే నాగేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

పోషకాహారం.. రుచికరం

పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారం భక్తులకు అందిస్తున్నారు. నగదుతో పాటు కూరగాయలు, నిత్యావసర సరకులు, బియ్యం వంటివి దాతలు నిత్యాన్నదానానికి అందిస్తూ తమ వంతు సహకరిస్తున్నారు. అన్నదానానికి రూ.వెయ్యి కంటే పైబడి విరాళం అందించిన దాతల పేరున ఏటా ఒకరోజు భక్తులకు అన్నదానం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

అయ్యప్ప మాలధారులకూ..

క్రైస్తవ పుణ్యక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ అన్నిమతాల భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ప్రతి ఏటా కార్తిక మాసంలో అయ్యప్పమాల, భవానీ మాలలు ధరించిన భక్తులు పుణ్యక్షేత్రానికి చేరుకుని అన్నప్రసాదం స్వీకరించడం ఇక్కడ విశేషం. అక్టోబర్‌ నుంచి జనవరి వరకూ ఎక్కువ మంది అయ్యప్ప మాలధారణ, భవానీ దీక్ష భక్తులు అన్నప్రసాదం స్వీకరించి పుణ్యక్షేత్రంలో విశ్రాంతి తీసుకుని వారి ప్రయాణం కొనసాగిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3.30 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. ఎంత మంది భక్తులు వచ్చినా లేదనకుండా భోజనం పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. నిర్మలగిరి సాంబారుకు మంచి గుర్తింపు ఉంది. ఈ సాంబారు రుచి అమోఘమని భక్తులు అంటుంటారు. మినరల్‌ వాటర్‌తో వంటకాలు తయారు చేసి నాణ్యమైన భోజనం భక్తులకు అందిస్తున్నారు. ఒక రౌండుకు సుమారు 750 మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.

వేసవిలో చల్లచల్లగా..

భక్తులకు వేసవిలో చల్లని నీటిని సరఫరా చేస్తున్నారు. పుణ్యక్షేత్రంలో తలనీలాల కాంట్రాక్టర్‌, అన్నదాన కార్యక్రమం నిర్వాహకుడు కళ్లే నాగేశ్వరరావు తన భార్య లలిత జ్ఞాపకార్థం నిత్యాన్నదాన భోజన శాల వద్ద కూలింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. వేసవిలో భక్తులకు ఇక్కడ చల్లని నీటిని అందజేస్తున్నారు.

అన్నంత సేవ1
1/1

అన్నంత సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement