
అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా అమలాపురం మహిళ
అమలాపురం టౌన్: అమెరికా దేశం వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం మహిళ చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్లో శనివారం జరిగిన కాన్వగేషన్లో శ్రీకావ్యకు ఎమ్మెస్ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది. హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్ బ్లెకింజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్ సిస్టమ్లో ఎమ్మెస్ డిగ్రీ చేసింది. కోచ్ కోడ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్లో శ్రీకావ్య ఆటోమేషన్ ఆఫ్ క్లౌడ్ హాస్టెడ్ అప్లికేషన్స్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్ చాంపియన్ షిప్ గెలుచుకుంది.
అదృశ్యమైన వ్యక్తి 18 రోజులకు ప్రత్యక్షం
పిఠాపురం: అప్పుల బాధ భరించలేక ఇల్లు వదిలి వెళ్లిపోయిన వ్యక్తి 18 రోజుల అనంతరం క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. తమను వదిలి వెళ్లిపోయిన తండ్రి ఫాదర్స్ డే నాడు తిరిగి రావడంతో పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పిఠాపురం ఏడు కాలువల ప్రాంతానికి చెందిన గీసాల శ్రీనివాస్ గత నెల 29న ధవళేశ్వరంలో ఎవరో డబ్బులు ఇవ్వాలని చెప్పి తన స్నేహితుడైన కాకి రమణ బైక్ తీసుకు వెళ్లాడు. తర్వాత రోజు సాయంత్రం 4 గంటల వరకు తన భార్యతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం తన సెల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి బంధువుల సహాయంతో వెతకగా ధవళేశ్వరం బ్యారేజీపై తాను తీసుకెళ్లిన బైక్, దుస్తుల బ్యాగు, చెప్పులు కనిపించాయి. దీంతో ఆయన భార్య గీసాల లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేయగా శ్రీనివాస్ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తన వస్తువులను వదిలి రైల్వే స్టేషన్ వరకూ వెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీనివాస్ పిఠాపురంలో తన ఇంటికి చేరుకున్నాడు. 18 రోజుల తరువాత అదీ ఫాదర్స్డే నాడు ఇంటికి చేరుకోవడంతో అతని పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లినట్లు శ్రీనివాస్ తెలిపాడు.

అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా అమలాపురం మహిళ