
కామేశ మహర్షి కారణజన్ములు
సంస్మరణ సభలో భక్తులు
పీఠాధిపతి కామేశ
మహర్షి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పీఠం ప్రేమ మందిరం అమ్మ వాణి
అమలాపురం టౌన్: స్థానిక శ్రీకామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి కారణజన్ములని, వందలాది మంది అనాథ బాల బాలికలకు ఆశ్రయం కల్పించిన మానవతావాదని భక్తులు ముక్త కంఠంతో అన్నారు. శ్రీకామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీఠంలో ఆదివారం జరిగిన కామేశ మహర్షి సంస్మరణ సభలో అనేక మంది భక్తులు పీఠాధిపతి సేవలను స్మరించారు. ట్రస్ట్ సభ్యుడు, న్యాయ సలహాదారు వీరా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభకు సాహితీవేత్త డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పీఠాధిపతి కామేశ మహర్షి దాదాపు 40 ఏళ్లకు పైగా పీఠం ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అందించారన్నారు. చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, పీఠంలో అనాథ పిల్లలు పెరిగే ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి మాట్లాడుతూ కామేశ మహర్షి సేవలను స్మరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. కామేశ మహర్షి సమాజ హితాన్ని కాంక్షించే వారని పీఠం ఉత్తరాధికారి విఘనస రాఖీ ప్రేమ్ అన్నారు. పీఠం బ్రహ్మ గోవిందవర్జుల నాగబాబు మాట్లాడుతూ భౌతికంగా పీఠాధిపతి మనకు దూరమైనా ఆయన ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం నిరంతరం పాటుపడాలన్నారు. పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు, ఎస్కేబీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ నూకల శ్రీనివాస్, కోనసీమ చిత్రకళా పరిషత్ అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి, విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏబీ నాయుడు, ట్రస్ట్ సభ్యుడు మట్టపర్తి సత్యనారాయణ, జ్యోతిష పండితుడు కర్రా వీరభద్రం, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు యర్రమిల్లి పాండురంగారావు తదితరులు ప్రసగించి కామేశ మహర్షి సేవా ప్రస్థానాన్ని వివరించారు. తొలుత కామేశ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు భమిడిపాటి కృష్ణమూర్తి, వెంకటరెడ్డి, సతీష్, కూచిమంచి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.