
దేవఆదాయ భూములు
పలివెల దేవస్థానం భూమిలో
మట్టి అక్రమ తవ్వకాలు
ఫ యథేచ్ఛగా మట్టి దోపిడీ
ఫ పలివెల భూముల్లో అక్రమ తవ్వకాలు
కొత్తపేట: దేవదాయ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొత్తపేట మండలం పలివెల పంచాయతీ పరిధిలో దేవదాయ– ధర్మదాయ శాఖ ధర్మసత్రం, ఉమా కొప్పేశ్వరస్వామివారి దేవస్థానం భూముల్లో మట్టిని అనుమతులు లేకుండా తవ్వి, తరలిస్తున్నారు. పలివెల ధర్మ సత్రానికి ఆ గ్రామ శివారు నక్కల కాలువకు ఆనుకుని 5.38 ఎకరాల వరి (పల్లం) భూమి ఉంది. దానిని గత వేలం పాటల్లో అదే గ్రామ శివారు పూజారిపాలెం గ్రామానికి చెందిన ఒక రైతు కౌలుకు పాడుకున్నారు. ఆ భూమిలో ఆ రైతు మూడు రోజులుగా జేసీబీతో మట్టిని తవ్వి, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ట్రాక్టర్ల లెక్కన మట్టిని పెద్ద మొత్తానికి విక్రయించినట్టు సమాచారం. ఈ మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపుపై స్థానికులు సంబంధిత శాఖ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, పైగా అది తమ భూమి కాదు.. ప్రైవేట్ భూమి అని చెప్పి మొఖం చాటేశారని ఫిర్యాదుదారులు అంటున్నారు. దీంతో ఆ శాఖ ఆర్జేసీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి ఆదేశాల మేరకు స్థానిక అధికారి, సిబ్బంది శనివారం మధ్యాహ్నం సంబంధిత భూమి వద్దకు వెళ్లి తవ్వకాలు నిలిపివేయించారు. వారు వెళ్లిన తరువాత మళ్లీ తవ్వకాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. అలాగే పలివెల – పల్లిపాలెం రోడ్డు నుంచి మట్లదొడ్డి వెళ్లే రోడ్డులో ఉమా కొప్పేశ్వరస్వామివారి దేవస్థానానికి చెందిన భూమిలో ఐదు రోజుల క్రితం మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టగా స్థానికుల ఫిర్యాదు మేరకు దేవస్థానం సిబ్బంది వెళ్లి నిలిపివేయించారు. తిరిగి శుక్రవారం తవ్వకాలు చేపట్టారు. దానిపై ఫిర్యాదు చేయగా, అది దేవస్థానం భూమి కాదని, ఫలానా రైతుకు చెందిన ప్రైవేట్ భూమిలో మెరకలు తీస్తున్నారని సంబంధిత దేవస్థానం, రెవెన్యూ సిబ్బంది చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో సంబంధిత రైతుకు స్థానికులు ఫోన్ చేసి ఆరా తీయగా తమ భూమి ఇప్పటికే పల్లమని, మట్టి తీయాల్సిన పనిలేదని చెప్పారు. దేవదాయ శాఖ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలపై సంబంధిత ఈఓ ఎస్.శివను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ధర్మసత్రం భూమిని పూజారిపాలేనికి చెందిన పల్లికొండ అర్జునరావు కౌలుకు పాడుకున్నారని తెలిపారు. మట్టి తవ్వకాలపై తమకు సమాచారం అందిన వెంటనే వెళ్లి నిలదీయగా మెరక పల్లాలు సరిచేసుకునేందుకు తవ్వుతున్నట్టు తెలిపారని, అనుమతులు లేకుండా తవ్వడం తగదని చెప్పి నిలిపివేయించామన్నారు.