
రూ.495 కోట్ల పొగాకు విక్రయాలు
దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ఒడుదొడుకుల్లోనే సాగుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభించి 82 రోజులు కాగా, ఇప్పటి వరకూ 65 రోజుల పాటు వేలం జరిగింది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.495.38 కోట్ల విలువైన 18.07 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయని రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పండిన పొగాకు 17.26 మిలియన్ల కిలోలు, తొర్రేడు ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో (బ్లాక్ సాయిల్ – బీఎస్) పండిన పొగాకు 8.06 లక్షల కిలోలు కొనుగోలు చేశారు. ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ 1,39,994 బేళ్లకు వేలం నిర్వహించారు. వీటిలో 1,34,085 బేళ్లు ఎన్ఎల్ఎస్, 5,909 బేళ్లు బీఎస్ బేళ్లు ఉన్నాయి. రైతులు శనివారం ఐదు వేలం కేంద్రాలకు 5,286 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, 3,671 బేళ్లు అమ్ముడయ్యాయి. 1,615 బేళ్లు అమ్ముడు పోలేదు. వారం రోజులుగా వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు వాపోతున్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 2.93 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 4.35, జంగారెడ్డిగూడెం–2లో 3.82, కొయ్యలగూడెంలో 3.29, గోపాలపురం వేలం కేంద్రంలో 3.66 మిలియన్ల కిలోల చొప్పున పొగాకు విక్రయాలు జరిగాయని రీజినల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు.