
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సత్యదేవుని ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంతి మండపాలు నవ దంపతులు, వారి బంధుమిత్రులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి, పూజలు చేశారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2,100 జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పశ్చిమ రాజగోపురం వద్ద చలువ పందిళ్ల నుంచి, ఆలయ ప్రాకారం చుట్టూ ఉన్న గ్రీన్ షేడ్ నుంచి వాన నీరు ధారగా కారడంతో భక్తులు పూర్తిగా తడిసిపోయారు. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గింది. వర్షం కారణంగా సత్యదేవుడు, అమ్మవారి పల్లకీ సేవ ఆలయం లోపలి ప్రాకారంలో నిర్వహించారు.
లోవలో భక్తుల రద్దీ
తుని: లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 30 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,460, పూజా టికెట్లకు రూ.2,15,550, కేశఖండన టికెట్లకు రూ.27,600, వాహన పూజ టికెట్లకు రూ.6,170, కాటేజీలకు రూ.92,792, డొనేషన్లుగా రూ.1,27,118 కలిపి రూ.7,17,690 ఆదాయం సమకూరిందని వివరించారు.
ముగిసిన ఉపాధ్యాయుల
కౌన్సెలింగ్
రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. గత నెల 21న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్లతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, భాషా పండితులు, ఫిజికల్ డైరెక్టర్లు, స్కూల్ అసిస్టెంట్ తదితర పలు క్యాడర్లకు సంబంధించి 5,010 మంది, సెకండరీ గ్రేడ్ క్యాడర్కు సంబంధించి 3,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ల బదిలీ ప్రక్రియ వెబ్ ఆప్షన్ల ద్వారా చేపట్టగా, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం తిరిగి వెబ్ ఆప్షన్ల ద్వారానే చేస్తామని చెప్పడంతో ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ఈ ప్రక్రియ ముగిసింది. రెగ్యులర్ ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్, ఒకేషనల్ విభాగాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. దీంతో మొత్తం ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ముగిసినట్లయింది. బదిలీ పొందిన గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికే ఆయా స్థానాల్లో చేరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బదిలీ అయిన ఎస్జీటీలు ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల్లో ఆదివారం రిలీవ్ అయి, సోమవారం ఆయా పాఠశాలల్లో చేరాలి. అన్ని యాజమాన్యాల్లోని ఎస్ఏ లాంగ్వేజెస్, ఎస్ఏ–పీఈ, ఎల్పీలు, పీఈటీలు బదిలీ అయిన స్థానాల్లో సోమవారం చేరాలి. ఎంపీపీ/జెడ్పీ యాజమాన్యాల పరిధిలోని ఎస్జీటీలు సోమవారం రిలీవ్ అయి, వారు బదిలీ పొందిన స్థానాల్లో చేరాలి. రిలీవ్ అయిన పాఠశాలలో సగం కంటే తక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే జీవోఎంఎస్ నంబర్–22 ప్రకారం జూనియర్ తిరిగి వెనక్కు వచ్చి పూర్వపు పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది.