
నల్లమిల్లికి టీడీపీపై మమకారం తగ్గలేదు
● అన్నింటిలోనూ ఆ పార్టీ వారికే
ప్రాధాన్యం ఇస్తున్నారు
● పర్సంటేజీల్లో తేడా వస్తుందనే
ఇలా చేశారా?
● అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై
బీజేపీ సీనియర్ నేత విమర్శ
అనపర్తి: తమ పార్టీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికై న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీపై ఇంకా మమకారం తగ్గలేదని బీజేపీ సీనియర్ నాయకుడు తేతలి సత్యనారాయణరెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీని రామకృష్ణారెడ్డి తిరోగమనంలోకి తీసుకు వెళుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నలభయ్యేళ్లుగా ఎంతో మంది నాయకులు పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి అభివృద్ధి చేశారన్నారు. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో అనపర్తిని బీజేపీకి కేటాయించడంతో పార్టీ విధేయులుగా తామంతా సంతోషించామన్నారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి బీజేపీని ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రతి విషయంలోనూ టీడీపీ శ్రేణులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీపై ఇంకా మమకారం తగ్గనందువల్లనే దాదాపు అన్నిచోట్లా టీడీపీ వారినే నియమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తరఫున విజయం సాధించిన ఆయన పార్టీపట్ల కనీస విశ్వాసం కూడా లేకుండా టీడీపీ వారినే నియమించుకుంటున్నారని, అనపర్తి మండలంలో ఒక్క బీజేపీ కార్యకర్తను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తున్న అనపర్తి పంచాయతీతో పాటు రెవెన్యూ, ప్రభుత్వ ఆసుపత్రి తదితర అన్ని వ్యవస్థల్లోనూ టీడీపీ కార్యకర్తలనే నియమించడంలో ఆంతర్యమేమిటని సత్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. పర్సంటేజీల్లో తేడా వస్తుందనే వారిని నియమించుకున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల పొత్తు సందర్భంగా టీడీపీ గెలిచిన చోట 50 శాతం పదవులు ఆ పార్టీ వారికి 30 శాతం బీజేపీకి, 20 శాతం జనసేనకు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట ప్రకారం అనపర్తి నియోజకవర్గంలో ఎంతమందికి పదవులు కేటాయించారో చెప్పాలని నిలదీశారు. వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన వ్యక్తిని పార్టీ మండల అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి నియమించారని, తాను పార్టీలోకి రాక ముందు నుంచి ఉన్న వారిని పక్కన పెట్టారని చెప్పారు. అలాగే ఉపాధి హామీ కూలీలను క్రియాశీలక సభ్యులుగా చూపిస్తూ పార్టీని మభ్యపెడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి విఫలమయ్యారని, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గాలికి వదిలేసి, కేవలం ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దాని పర్యవసానంగానే వెన్నుపోటు దినం విజయవంతమైందని, బిక్కవోలులో తాను తలపెట్టిన కార్యక్రమం విఫలమైందని సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఇకనైనా ఎమ్మెల్యే పద్ధతి మార్చుకుని బీజేపీకి విధేయుడిగా పని చేయాలని సూచించారు.