
రత్నగిరిపై పెళ్లి సందడి
● నవ దంపతులతో ఆలయం కిటకిట
● స్వామివారి దర్శనానికి 40 వేల మంది
● రెండు వేల వ్రతాల నిర్వహణ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారు జామున రత్నగిరిపైన, శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో నవ దంపతులు, బంధు మిత్రులతో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, రెండు వేల వ్రతాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఆదివారం రాత్రి, సోమవారం పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనుండడంతో రామాలయం వద్ద వార్షిక కల్యాణ మండపం ఎదుట ఉన్న విశ్రాంతి మండపంలో మండపాలు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఆరు సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 533 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 270 మంది హాజరయ్యారు. కాకినాడ జిల్లా పరిధిలో తొమ్మిది సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,143 మందికి 786 మంది, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఐదు సెంటర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించగా, 809 మందికి 605 మంది హాజరయ్యారు. జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు కోనసీమ జిల్లాలో ఆరు సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,067 మందికి 733 మంది హాజరు కాగా, కాకినాడ జిల్లాలో 1,667 మందికి 1,179 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,282 మందికి 954 మంది హాజరైనట్టు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్.శైలజ తెలిపారు.