సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం, శస్త్రచికిత్సలను ఉచితంగా అందించే ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) ఆగింది. రెండు దశాబ్దాలుగా ఎంతో మంది పేదల ప్రాణాలు నిలిపిన ఈ పథకం.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నిలిచిపోయింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, తమకు వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే వైద్య సేవలు నిలిపివేస్తామని కొన్ని రోజుల ముందే నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీసులు ఇచ్చాయి. బకాయిల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స కోసం వివిధ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన రోగులు, వారి బంధువులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని ఆయా ఆస్పత్రుల సిబ్బంది చెప్పడంతో కంగు తిన్న పేదలు ఏం చేయాలో తెలియని ఆవేదనతో వెనుతిరిగారు. పేదల ప్రాణదాయినిగా ఉన్న ఈ పథకం నిలిచిపోవడానికి కారణమైన కూటమి ప్రభుత్వానికి వారు శాపనార్థాలు పెట్టారు.
రూ.150 కోట్లకు పైగా బకాయిలు
ఎన్టీఆర్ వైద్యసేవ కింద తెల్ల రేషన్కార్డు దారులకు కార్పొరేట్ స్థాయిలో వివిధ చికిత్సలు, ప్రొసీజర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనికి అయిన ఖర్చును ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు చెల్లిస్తూంటుంది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే.. గడచిన పది నెలలుగా నయాపైసా కూడా చెల్లించలేదు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద గుండె, ఈఎన్టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, ఆర్థో తదితర శస్త్రచికిత్సలు చేసిన నెట్వర్క్ ఆస్పత్రులకు జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీని కోసం పదేపదే విజ్ఞప్తులు చేసినా, ఉన్నతాధికారులతో చర్చలు జరిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ ఉచిత వైద్య సేవలను ఆయా ఆస్పత్రులు నిలిపివేశాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ వైద్య సేవలు సైతం ఆగిపోతే తమ పరిస్థితేమిటనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. సేవలు నిలిపివేసినట్లు ఆయా ఆస్పత్రుల సిబ్బంది చెబుతూండటంతో శస్త్రచికిత్సలకు వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అయితే, జిల్లా వ్యాప్తంగా 35 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఉచిత సేవలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
నిర్వీర్యం చేసేందుకు కుట్ర
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి బీమా పథకం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ పథకం బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది.
రూ.508.49 కోట్లు వెచ్చింపు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలుకు భారీగా ఖర్చు చేసింది. జిల్లా వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, శస్త్రచికిత్సలకు రూ.508,49,95,571 కోట్లు వెచ్చించింది. 2,48,805 మందికి వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసింది. ఏటా రూ.50 కోట్లకు పైనే నిధులు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేసింది. ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని వర్తింపజేసి, దీనిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. గుండె, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్ వంటి ఖరీదైన శస్త్రచికిత్సలకు సైతం ఆరోగ్యశ్రీలో చోటు కల్పించింది. గత సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో ఖరీదైన వ్యాధులకు సైతం ఉచితంగా చికిత్స చేయించుకునే వెసులుబాటు పేదలకు కలిగింది. బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్కు రూ.11.97 లక్షలు, ఆల్లోజెనిక్ బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ (14 ఏళ్లు పైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షలు వెచ్చించేలా ఏర్పాటు చేశారు.
అత్యవసర వైద్యానికి ఇబ్బంది లేదు
జిల్లాలో 29 ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు ఈ పథకాన్ని ఆపేశాయి. మిగిలిన ఆస్పత్రుల్లో యథావిధిగా నడుస్తోంది. సేవలు నిలిపివేసినా అత్యవస వైద్యానికి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. సేవలు ఆపేసిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి.
– డాక్టర్ ప్రియాంక,
జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి
పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వినూత్న రీతిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులు, ప్రొసీజర్లతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్థానం 3,275 వ్యాధులు, ప్రొసీజర్లు విస్తరించారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు, డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టు వైద్యులతో పాటు నర్సు, పారామెడికల్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. రోగులకు నాణ్యమైన మందులు, పౌష్టికాహారం అందజేసేలా చూశారు. ఆరోగ్య మిత్రతో కూడిన హెల్ప్డెస్క్ పక్కాగా ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకు చికిత్సను నిరాకరిస్తే ఆయా నెట్వర్క్ ఆస్పత్రులపై చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు.
ఆగిన ఎన్టీఆర్ వైద్య సేవ
నెట్వర్క్ ఆసుపత్రులకు
రూ.150 కోట్లకు పైగా బకాయిలు
చెల్లించాలంటూ
యాజమాన్యాల విన్నపాలు
స్పందించని సర్కారు..
నిలిచిన వైద్య సేవలు
చికిత్సకు వచ్చి నిరాశతో
వెనుదిరిగిన రోగులు
ఇప్పటికే ఈహెచ్ఎస్ సేవల నిలిపివేత
అధికారుల లెక్కలివీ..
జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తున్న ఆస్పత్రులు 81
వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులు 35
ప్రైవేటువి 46
వీటిలో సేవలు పూర్తిగా నిలిచినవి 29
అడపాదడపా సేవలు అందిస్తున్నవి 17
జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో
ఆరోగ్యశ్రీ లబ్ధి వివరాలు
సంవత్సరం వైద్యం వెచ్చించిన
చేయించుకున్న మొత్తం
వారు (రూ.కోట్లు)
2019–20 25,750 62.71
2020–21 29,602 62.15
2021–22 47,039 89.48
2022–23 1,46,414 294.15
పేదల ఆరోగ్యంపై.. నిర్లక్ష్యపు పడగ
పేదల ఆరోగ్యంపై.. నిర్లక్ష్యపు పడగ