
ఖాతారు చేయని సర్కారు!
సాక్షి, అమలాపురం: ఖరీఫ్ ముంచుకొస్తోంది. ఒకవైపు వాతావరణం చల్లబడింది. ప్రభుత్వం డెల్టా కాలువలకు ఆలస్యంగానైనా నీరు విడుదల చేసింది. మరో వారం, పది రోజుల్లో జిల్లాలో ఖరీఫ్ నారుమళ్లు మొదలు కానున్నాయి. పెట్టుబడులకు రైతు చేతిలో చిల్లి గవ్వలేకుండా పోయింది. రబీ ధాన్యం సొమ్ము కోసం ఆయకట్టు రైతులు రోజుల తరబడి ఎదురు తెన్నులు చూస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులను నీరుగారుస్తోంది.
‘‘రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు చేస్తే 24 గంటలలో వారి ఖాతాల్లో జమ చేస్తాము. ఇది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉంచినట్టుగా ధాన్యం సొమ్ముకు రోజుల తరబడి బకాయిలు ఉంచము’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ పలు సందర్భాలలో సెలవిచ్చారు. రబీ ధాన్యం కొన్న మొదట్లో అలాగే చెల్లించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కొనుగోలు పెరిగిన తరువాత కూటమి ప్రభుత్వం ముసుగు తొలగించింది. రోజుల తరబడి సొమ్ము చెల్లించకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. జిల్లాలో 1,64,854 ఎకరాల్లో రబీ సాగు జరగగా, 5,86,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. తొలుత రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆయా కేంద్రాలకు టార్గెట్లను కుదించింది. రైతుల వద్ద సగం ధాన్యం ఉన్నా సరే ఆయా కేంద్రాలలో టార్గెట్లు అయిపోయాయని కొనుగోలు నిలుపుదల చేశారు. దీనితో మిల్లర్లను, దళారులను ఆశ్రయించాల్సి రావడం, ఇదే అదనుగా కనీస మద్దతు ధర సాధారణ రకం బస్తా (75 కేజీలు) రూ.1,720 ఉండగా వారు రూ.1,400, రూ.1,500 చేసి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మండపేట, రాజోలు, అమలాపురం వంటి ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యంతో రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో ధాన్యం సేకరణ లక్ష్యం మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. కాని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదు.
కొనుగోలు లేదు... చెల్లింపు లేదు
జిల్లాలో ఇప్పటి వరకు 2,69,375.360 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనిలో 499.840 మెట్రిక్ టన్నులు గ్రేడ్– ఏ రకం కాగా, 2,68,875.520 మెట్రిక్ టన్నులు సాధారణ రకం. మొత్తం ధాన్యం విలువ రూ.613.08 కోట్లు కాగా, ఇప్పటి వరకు రైతులకు రూ.364.43 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.248.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో రూ.246.94 కోట్లు బిల్లులు ఆమోదించి చెల్లింపుల కోసం పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించారు. సాంకేతిక కారణాల వల్ల రూ.1.20 కోట్ల చెల్లింపులను బ్యాంకులు వెనక్కు పంపాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
మే నెల 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత మే నెలలో ఇదే సమయానికి రైతులకు ఉన్న ధాన్యం బకాయిలు రూ.167 కోట్లు ఉండగా సోమవారం నాటికి ఇది రూ.248.65 కోట్లకు పెరిగింది. ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో ధాన్యం సొమ్ము చెల్లించపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే రబీ కోతలకు పెద్ద ఎత్తున అప్పులు చేశామని వారు చెబుతున్నారు. ‘‘ధాన్యం షావుకార్లు, మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యం కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మకాలు చేస్తే మంచి ధర వస్తుందని భావించాము. అప్పులు చేసి నూర్పిడులు పూర్తి చేశాము. కాని 45 రోజులుగా సొమ్ము వేయడం లేదు. వచ్చే కొద్దిపాటి లాభం చేసిన అప్పులకు, చెల్లించే వడ్డీకి సరిపోతోంది’ అని రైతులు వాపోతున్నారు. గతంలో ఇన్ని రోజుల పాటు ధాన్యం సొమ్ము బకాయిలు ఉంచిన దాఖలాలు లేవని వారు చెబుతున్నారు. బ్యాంకుల అప్పులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పద్దులను ఓవర్ డ్యూలో పెడుతున్నారని, ముందు ముందు బ్యాంకు అప్పులు కూడా పుట్టవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సొమ్ము బకాయిలపై కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు.
జూన్ మూడవ వారం వచ్చినా సొమ్ము ఇవ్వరా?
జిల్లాలో ధాన్యం సొమ్ము చెల్లింపును మే 8వ తేదీ నుంచి నిలిపివేశారు. దీనివల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ పెట్టుబడులకు సైతం అప్పులు చేయాల్సి వస్తోంది. నూర్పిడులకు చేసిన అప్పులకు వడ్డీలే కట్టాలా? ఖరీఫ్ కోసం మరోసారి అప్పులు చేయాలా? అనే మీమాంస రైతులలో నెలకొంది. ప్రభుత్వం తక్షణం ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
– యాళ్ల బ్రహ్మానందం, అధ్యక్షుడు,
కోనసీమ రైతు పరిరక్షణ సమితి
కె.గంగవరంలో ధాన్యం కొనుగోలు
ధాన్యం అమ్మకాలు చేసి
నెలన్నరకు పైగా..
నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బు
జిల్లాలో 2.69 మెట్రిక్ టన్నుల కొనుగోలు
కొన్న ధాన్యం విలువ రూ.613.08 కోట్లు
రైతులకు చెల్లించింది
రూ.364.43 కోట్లు
ఇంకా చెల్లించాల్సింది
రూ.248.65 కోట్లు
ఖరీఫ్ పెట్టుబడులకు సొమ్ము లేదు
రబీ అప్పులకు పెరుగుతున్న వడ్డీ
ఓవర్ డ్యూలోకి పోతున్న బ్యాంకు ఖాతాలు
కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన
కోనసీమ రైతు పరిరక్షణ సమితి

ఖాతారు చేయని సర్కారు!