
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● రత్నగిరిపై సత్రాలకు ఎట్టకేలకు మరమ్మతులు
● రూ.1.20 కోట్లతో పనులు
● రెండు నెలల్లో పూర్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ సత్రాల మరమ్మతులు ఎట్టకేలకు సోమవారం ప్రారంభమయ్యాయి. రూ.1.20 కోట్లతో న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాల్లో ఈ పనులు ప్రారంభించారు. ఈ పనులను ఈఓ వీర్ల సుబ్బారావు పరిశీలించారు. ఆయా సత్రాల్లో చేపడుతున్న పనుల గురించి ఆయనకు ఈఈ వి.రామకృష్ణ వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, టెండర్ షరతుల ప్రకారం ఈ మూడు సత్రాల్లో మరమ్మతులు పూర్తి చేయడానికి మూడు నెలల గడువుందని చెప్పారు. అయితే రెండు నెలల్లోనే పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తేవాల్సిందిగా ఈఓ ఆదేశించారన్నారు. ఆ మేరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మూఢమి, దానికి తోడు ఈ నెల 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు జరగవు. అందువలన ఈ సమయంలో భక్తులు పెద్దగా రారు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆలోగా సత్రాల మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సగం గదుల్లో సమస్యలు
దేవస్థానంలో హరిహర సదన్, శివసదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ, ప్రకాష్ సదన్, శ్రీ సీతారామ సత్రం, కొండ దిగువన సత్య నికేతన్ సత్రాలున్నాయి. వీటిల్లో ఏసీ, నాన్ ఏసీ గదులు 620 ఉన్నాయి. వీటిలో సుమారు 120 గదులు పాడై, అద్దెకిచ్చేందుకు ఏమాత్రం వీలుగా లేవు. మరో 150 గదుల్లో ఫర్నిచర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సరిగా లేవు. ప్రకాష్ సదన్ వంటి సత్రాల్లో బస చేసిన భక్తులు ఆ గదుల్లో ఉండలేక రాత్రికి రాత్రే ఖాళీ చేసిన సందర్భాలు కోకొల్లలు. వీటికి మరమ్మత్తులు చేయించాలని చాలా కాలం నుంచి భక్తులు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. గత ఏడాది అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్రాల గదులకు మరమ్మత్తులు చేయించాలని నిర్ణయించి, అంచనాలు రూపొందించారు. తొలుత రూ.40 లక్షలతో హరిహర సదన్ సత్రంలో గదులకు మరమ్మత్తులు పూర్తి చేసి, రంగులు వేయించారు. తరువాత న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాలకు మరమ్మత్తులు చేయించేయించాలని నిర్ణయించి, రూ.40 లక్షల చొప్పున అంచనాలు రూపొందించి, టెండర్లు ఖరారు చేశారు.
● ఓల్డ్ సెంటినరీ సత్రం: దీనిని నిర్మించి సుమారు 30 సంవత్సరాలైంది. ఇందులో 48 గదులున్నాయి. పెళ్లి బృందాల వారు ఇక్కడ గదులు రిజర్వ్ చేసుకుని, సత్రం ఆవరణలో వివాహాలు చేసుకుంటారు. ఈ సత్రం గదులకు పెయింట్లు వేసి చాలా కాలమైంది. డోర్లు, కిటికీలు, వాటర్ పైప్లైన్లు, బాత్రూముల్లో ఫిట్టింగ్స్ పగిలిపోయాయి. నీరు లీకవుతూండటంతో డ్రైనేజీ పైప్లైన్లకు నాచు పట్టింది. కొన్నిచోట్ల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి.
● న్యూ సెంటినరీ సత్రం: సుమారు 28 ఏళ్ల కిందట నిర్మించిన ఈ సత్రంలో కూడా 48 గదులున్నాయి. వివాహాది శుభకార్యాలకు భక్తులు గదులు రిజర్వ్ చేసుకుంటారు. ఇందులో కూడా ఓల్డ్ సెంటినరీ సత్రం మాదిరిగానే సమస్యలున్నాయి.
● ప్రకాష్ సదన్ సత్రం: వీఐపీ సత్రంగా పేరొందిన ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. 86 గదులున్నాయి. గదికి రూ.వెయ్యి చొప్పున రోజుకు రూ.86 వేల మేర అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. స్వామివారి ఆలయానికి దగ్గరగా ఉండటం, దగ్గర్లోనే క్యాంటీన్, పార్కింగ్ సదుపాయాలుండటంతో ఈ సత్రంలో బస చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులోని పలు గదుల్లో కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది.