ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు! | - | Sakshi
Sakshi News home page

ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు!

Jun 17 2025 5:24 AM | Updated on Jun 17 2025 5:38 AM

ఖరీఫ్‌ ఆలస్యమైతే సాగుకు దూరం

గత నెల చివరి వారంలో నైరుతి రాకముందే తొలకరి వర్షాలు జిల్లాలో కురిసాయి. నాలుగు రోజుల పాటు వర్షాలు పడడంతో ఖరీఫ్‌కు వరుణుడు శుభారంభం పలికినట్టు రైతులు ఆశించారు. తిరిగి నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీరందితే రైతులు నారుమడులు వేసుకునేందుకు దుక్కులు ప్రారంభించేవారు. కాని కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో రైతులకు నారుమడులు పోసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది మరింత ఆలస్యమైతే రైతులు సాగు విరమించుకునే ప్రమాదం కూడా ఉంది.

ముందస్తు సాగు చేయకపోతే

మునిగిపోతాం

డెల్టా శివారుల్లో... మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ముందస్తు సాగు చేయకుంటే చేలు ముంపు బారిన పడతాయి. ఈ కారణంగానే మా ఆయకట్టు రైతులు తొలి పంటకు దూరమవుతున్నారు. అటువంటిది ఇప్పటి వరకు కాలువలకు నీరు ఇవ్వకుంటే సాగు ముందుకు ఎలా సాగుతుంది. అధికారులు అర్థం చేసుకోవాలి.

– బొక్కా శ్రీనివాస్‌, రైతు, అల్లవరం

అసలు గడువు కన్నా ఆలస్యంగా నీటి విడుదల

మధ్య డెల్టాలో శివారులకు చేరని వైనం

ఇప్పటికీ ప్రధాన కాలువకు

700 క్యూసెక్కులే

ఇంకా పంట కాలువల మీద

‘సాగుతూ...’నే ఉన్న పనులు

పంట కాలువలు క్లోజ్‌ చేసింది ఏప్రిల్‌ 27న

పనులకు అనుమతి వచ్చింది మే నెలాఖరున

ఖరీఫ్‌కు పలువురు రైతులు

దూరమయ్యే ప్రమాదం

సాక్షి, అమలాపురం: మధ్య డెల్టా (కోనసీమ సీమ)లో ఖరీఫ్‌ సాగుకు ప్రధాన అవరోధం ముంపు. మరీ ముఖ్యంగా అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 మధ్య ఈశాన్య రుతుపవనాలు... బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ల వల్ల ఖరీఫ్‌ పంట ముంపుబారిన పడడం సర్వసాధారణంగా మారింది. ఈ కారణంగా ఇక్కడ ముందస్తు సాగు చేయడం ద్వారా భారీ వర్షాలు.. తుపాన్ల బారి నుంచి పంటను రక్షించుకునే అవకాశముంది. దీనిని గుర్తించి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ముందస్తు సాగుకు దన్నుగా జూన్‌ 1వ తేదీన సాగునీరు విడుదల చేసేది. కూటమి ప్రభుత్వం మాత్రం జూన్‌ 15 దాటినా మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయకుండా ఆయకట్టు రైతులకు ఖరీఫ్‌ను దూరం చేస్తోంది. జిల్లాలో 2,52,742 ఎకరాల రిజిస్టర్‌ ఆయకట్టు ఉండగా, 2,46,155 ఎకరాల నికర ఆయకట్టు. దీనిలో 1.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగు జరుగుతోందని అంచనా. ఇందులో మధ్యడెల్టా పరిధి (పాత కోనసీమ ప్రాంతం)లో సుమారు 1.10 లక్షల ఎకరాలు ఉంటుంది. దీనిలో ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో శివారు ఆయకట్టు అధికం. ఇక్కడ ఏడు మండలాల్లో 60 వేల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉందని అంచనా. మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారడంతో కొద్ది పాటి వర్షానికే వరి చేలు రోజుల తరబడి నీట మునగడం, పంట నష్టపోవడం పరిపాటి. ఈ కారణంగానే రైతులు ఏటా సుమారు ఐదు వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుకు దూరమవుతున్నారు. ఏటా తొలకరి సాగు వదిలేసే రైతుల సంఖ్య.. ఆయకట్టు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా డెల్టా కాలువలకు ముందస్తు సాగునీరు పంపిణీ చేయాలనే నిర్ణయం వెనుక ముంపు ఒక కారణం. మూడేళ్ల కాలంలో గోదావరి డెల్టాలో ముందస్తు సాగుకు అనుకూలంగా జూన్‌ 1వ తేదీన పంట కాలువలకు నీరు విడుదల చేసేవారు. గత ఏడాది సాధారణ ఎన్నికల హడావుడిలో అధికారులు ఉన్నా జూన్‌ 1న నీరు వదిలారు. ఇప్పుడు కూడా మధ్య డెల్టాకు ఒకటవ తేదీన సాగునీరు వదిలారు. అయితే తొలి పది రోజులు మధ్యడెల్టాకు కేవలం 100 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 12వ తేదీ నుంచి 250 క్యూసెక్కులకు నీరు పెంచారు. ఆదివారం 700, సోమవారం 1,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మధ్య డెల్టా పరిధిలో ముక్తేశ్వరం కాలువకు అయినవిల్లి మండలం చింతనలంక లాకుల దిగువకు నీరు వదలడం లేదు. అమలాపురం నడిపూడి లాకుల వద్ద నుంచి బెండాకెనాల్‌కు నీరు వదలడం లేదు. అమలాపురం నుంచి చల్లపల్లి కాలువకు నీరు వదిలినా అది కూడా అరకొరగానే. మొత్తమ్మీద మధ్య డెల్టా ప్రతి శివారు ప్రాంతంలో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.

మే నెల చివరిలో క్లోజర్‌కు అనుమతులు

గోదావరి డెల్టాలో ఈ ఏడాది క్లోజర్‌ సమయంలో చేపట్టిన పనుల విలువ రూ.5.50 కోట్లు మించి లేదు. ఇందులో డ్రైనేజీ విభాగంగా రూ.2.50 కోట్లతో ఆత్రేయపురం మండలంలో సైఫన్‌ నిర్మాణాలు చేపట్టగా, మిగిలిన నిధులతో ఇరిగేషన్‌ రెగ్యులర్‌ విభాగం అరకొర పనులు చేపట్టింది. వీటిలో పంట కాలువల్లో పూడిక తీత, చిన్నచిన్న మరమ్మతులు ఉన్నాయి. డెల్టా ప్రధాన పంట కాలువలను ఏప్రిల్‌ 15తో మూసివేస్తామన్న అధికారులు రైతుల కోరిక మేరకు 20వ తేదీ వరకు పెంచారు. తరువాత చేపల సాగు చేసే రైతులు కాసులు చెల్లించడంతో గడువును దఫదఫాలుగా పెంచుకుంటూ ఏప్రిల్‌ 27వ తేదీ వరకు నీరు విడుదల చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలువలు మూసివేశారు. కాలువలపై చేపట్టిన అరకొర పనులకు అప్పటికే అనుమతులు ఇచ్చి ఉంటే కాలువలు ఎండిపోయిన తరువాత కనీసం మే 15 నుంచి అయినా పనులు మొదలు పెట్టేవారు. కానీ ఈ పనులకు మే నెలాఖరున అనుమతులు మంజూరు చేయడం విశేషం. ఈ కారణంగా జూన్‌ ఒకటి తరువాత పనులు మొదలు పెట్టారు. పది కల్లా పూర్తి చేస్తామని చెప్పి చేయకపోవడంతో కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయలేదు. దీనివల్లే ఇంకా పూర్తిస్థాయిలో పంట కాలువల ద్వారా నీరందే పరిస్థితి లేకుండా పోయింది. ఇది మధ్యడెల్టా శివారుల్లో సాగు ఆలస్యం అవడానికి కారణమైంది.

ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు!1
1/2

ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు!

ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు!2
2/2

ముందస్తు సాగుకు ‘వెనకస్తు’ నీరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement