గూగుల్‌తో హెచ్‌పీ జట్టు! | Sakshi
Sakshi News home page

గూగుల్‌తో హెచ్‌పీ జట్టు!

Published Fri, Sep 29 2023 1:38 AM

Manufacturing Of Chromebooks In India From October 2 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లోనే క్రోమ్‌బుక్స్‌ను ఉత్పత్తి చేసే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ చేతులు కలిపింది. అక్టోబర్‌ 2 నుంచి వీటిని చెన్నైకి దగ్గర్లోని తమ ఫ్లెక్స్‌ ఫెసిలిటీలో వీటి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు హెచ్‌పీ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బేడి తెలిపారు. 2020 ఆగస్టు నుంచి హెచ్‌పీ ఈ ప్లాంటులోనే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల శ్రేణిని ఉత్పత్తి చేస్తోంది. (ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌, హోంలోన్‌ ఆఫ్‌ర్‌ పొడిగింపు, ఇక కార్‌ లోన్లపై..!)

భారత్‌లో విద్యారంగం డిజిటల్‌ పరివర్తనకు తమ వంతు తోడ్పాటు అందించే క్రమంలో ఇదొక కీలక మైలురాయి కాగలదని గూగుల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం హెడ్‌ (దక్షిణాసియా) బాణీ ధవన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం గూగుల్‌ క్రోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో లభించే క్రోమ్‌బుక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది పైచిలుకు విద్యార్థులు, టీచర్లు వినియోగిస్తున్నారు. కేజీ నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాభ్యాసానికి ఉపయోగిస్తున్న డివైజ్‌లలో ఇవి అగ్రస్థానంలో ఉన్నాయి. నోట్‌బుక్స్‌తో పోలిస్తే క్రోమ్‌బుక్స్‌ ధరలు కొంత తక్కువగా ఉంటాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్‌ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థల్లో హెచ్‌పీ కూడా ఉంది.

Advertisement
Advertisement