RFC: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | Sakshi
Sakshi News home page

రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Published Sat, Jan 20 2024 3:22 AM

Vistex Company CEO Sanjay Shah Passed away in Ramoji Film City Incident: hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌ నగర శివార్లలో ఈనాడు అధి నేత చెరుకూరి రామోజీరావు నేతృత్వంలోని రామో జీ ఫిల్మ్‌ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్వా హకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపో వడం, అత్యవసర సమయంలో వినియోగించడా నికి అంబులెన్స్‌లు సైతం లేక ఆస్పత్రికి తరలించ డంలో 20 నిమిషాల వరకు ఆలస్యం కావడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. అంచెలంచెలుగా ఎది గిన ప్రవాస భారతీయుడు, బహుళజాతి సంస్థ విస్టెక్స్‌ ఏషియా పసిఫిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సీఈఓ సంజయ్‌ షా (56) ప్రాణాలు కోల్పోయా రు.

తీవ్రంగా గాయపడిన ఆ సంస్థ ప్రెసిడెంట్‌ దాట్ల విశ్వనాథ్‌ రాజు అలియాస్‌ రాజు దాట్ల (52) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే ఘటనా స్థలిలోనే ఉన్న షా సతీమణి అంబులెన్స్, అంబులెన్స్‌ అంటూ అక్కడ ఉన్న ఫిల్మ్‌ సిటీ సిబ్బందిని విలపిస్తూ వేడుకోవడం కంటతడి పెట్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కలిదిండి జానకిరామ్‌ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్‌ సిటీ సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ముంబై నుంచి అమెరికా దాకా..
ముంబైకి చెందిన సంజయ్‌ షా 1989లో అమెరికాకు వలసవెళ్ళారు. అక్కడి లేహై యూనివర్సిటీ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అమెరికాలోనే ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్, జనరల్‌ మోటార్స్‌లతో పాటు జర్మనీలోని సాప్‌ సంస్థలోనూ ఉన్నత స్థానాల్లో పని చేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్‌ కేంద్రంగా విస్టెక్స్‌ సంస్థను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్‌ రూ.3,500 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోనూ దీని కార్యాలయం ఉంది. దీనికి కలిదిండి జానకిరామ్‌ రాజు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించిన యాజమాన్యం రామోజీ ఫిల్మ్‌ సిటీని వేదికగా ఎంచుకుంది. 

లైమ్‌లైట్‌ గార్డెన్‌లో..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విస్టెక్స్‌ కార్యాలయాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా.. ప్రతి కార్యక్రమానికీ సీఈఓ సంజయ్‌ షా, ప్రెసిడెంట్‌ విశ్వనాథ్‌ రాజు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌ లోని తమ ఉద్యోగులు, క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్‌ సిటీలోని లైమ్‌లైట్‌ గార్డెన్‌ను బుక్‌ చేసుకున్నారు. రెండురోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. 

20 అడుగుల ఎత్తునుంచి దిగుతూ..
ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్‌ స్టేజీపైన ఉన్న రూఫ్‌కు తాళ్లు కట్టి, వాటికి వేలాడేలా చెక్కతో ఓ ప్లాట్‌ఫామ్‌ తయారు చేశారు. అలంకరించిన ఆ ప్లాట్‌ఫామ్‌ మె ల్లగా కిందకు దిగుతుండగా సీఈఓ, ప్రెసిడెంట్‌లు 20 అడుగుల ఎత్తులో దానిపై నిలబడి.. ఆహుతు లకు అభివాదం చేస్తూ స్టేజీపైకి దిగేలా ఏర్పాట్లు చే శారు. ఇందుకు ఫిల్మ్‌ సిటీతో పాటు ఈవెంట్‌ మేనే జర్ల అనుమతి కూడా తీసుకున్నారు.

చెక్కతో చేసిన సదరు ప్లాట్‌ఫామ్‌కు రెండు వైపులా ఇనుప చువ్వ లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.40 గంటల సమయంలో ఈ ప్లాట్‌ఫామ్‌ పైకి ఇద్దరూ ఎక్కగా.. పైన ఉన్న రూఫ్‌కు కట్టిన తాళ్ల సాయంతో ప్లాట్‌ఫామ్‌ను పైనుంచి కిందకు దింపడం ప్రారంభించారు. అయితే కొద్దిసే పటికే ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్‌ఫామ్‌ పక్కకు ఒరిగి, దానిపై ఉన్న ఇద్దరూ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్‌తో కట్టిన స్టేజీపై వేగంగా పడి పోయారు.

సరైన భద్రతా ఏర్పాట్లు లేవు.. రెస్క్యూ లేదు
విస్టెక్స్, ఫిల్మ్‌ సిటీ ఉద్యోగులు, ఈవెంట్‌ మేనేజర్లు వెంటనే అక్కడ గుమిగూడారు. విస్టెక్స్‌ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఏదైనా పెద్ద ఆస్పత్రికి తరలించడానికి సహాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న వారిని కోరారు. ఓ వైపు సరైన భద్రతా ఏర్పాట్ల లోపం కారణంగా ప్రమాదం జరగ్గా.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా సరైన రెస్క్యూ టీమ్‌ సైతం ఫిల్మ్‌ సిటీకి లేకపోవడంతో విలువైన సమయం వృధా అయ్యింది. ఆస్పత్రికి తరలింపు ఆలస్యమైంది. విస్టెక్స్‌ ప్రతినిధులు, షా భార్య 15 నుంచి 20 నిమిషాలు వేడుకుంటే తప్ప ఫిల్మ్‌ సిటీ నిర్వాహకులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేదు.

అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఒక అంబులెన్స్‌లో సంజయ్‌ షాను హయత్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పతికి తరలించారు. విశ్వనాథ్‌ రాజును తీసుకువెళ్లడానికి మరో అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సొంత కారులోనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంజయ్‌ షా కన్నుమూశారు. విశ్వనాథ్‌ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. శరీరంలో అనేక చోట్ల ఎముకలు విరగటంతో పాటు తీవ్ర గాయాలైన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఫిల్మ్‌ సిటీపై క్రిమినల్‌ కేసు నమోదు
జానకిరామ్‌ రాజు తన ఫిర్యాదులో ఫిల్మ్‌ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజ్‌మెంట్‌ (ఉషా కిరణ్‌ ఈవెంట్స్‌), సీనియర్‌ ఈవెంట్‌ మేనేజర్‌ రితిక్‌ ఛటర్జీ, సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ మేనేజర్‌ జి.ఉదయ్‌ కిరణ్, ఫిల్మ్‌ సిటీలో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కాంట్రాక్టర్‌గా ఉన్న ఎస్‌.సురేష్‌ బాబు, రోప్‌ ఆపరేటర్‌ ఎస్‌.దుర్గా సతీష్‌ తదితరులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 336, 287 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద వీరిపై ఆరోపణలు చేశారు. 

భార్య కళ్ల ఎదుటే ప్రమాదం
రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రమాదం జరిగిన సమయంలో విస్టెక్స్‌ సంస్థ సీఈఓ సంజయ్‌ షా భార్య కూడా అక్కడే ఉన్నారు. దంపతు లిద్దరూ గురువారం సాయంత్రం తమ సొంత విమానంలో ముంబై నుంచి శంషాబాద్‌ విమా నాశ్రయానికి, అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీకి వచ్చారు. స్టేజీ కింద ఆహుతులతో కలిసి సంజయ్‌ భార్య కూర్చుని వీక్షిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో పరుగున స్టేజీ పైకి వచ్చిన ఆమె.. రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను ఆస్పత్రికి తరలించండి అంటూ దాదా పు 15 నిమిషాలు అందరినీ వేడుకున్నారు.

ఉస్మానియాలో పోస్టుమార్టం.. ముంబైకి మృతదేహం
సంజయ్‌ షా మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భార్యకు అప్పగించారు. అక్కడి నుంచి శవపేటికను మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఎయిర్‌పోర్టుకు, ఆపై విమానాశ్రయం అంబులెన్స్‌లో షా విమానం ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కానీ అందులో శవ పేటికను పెట్టడానికి అవకాశం లేకపోవడంతో కార్గో విమానంలో ముంబైకి పంపారు. షా భార్య సహా మిగిలిన వారు సంజయ్‌ విమానంలోనే ముంబై వెళ్ళారు. తమ స్వస్థలం గుజరాత్‌ అని, ఏళ్ళ క్రితమే ముంబైకి వలసవచ్చామని సంజయ్‌ భార్య పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement